TDP: అసెంబ్లీ సమావేశాలపొడిగింపు కోసం టీడీపీ పట్టు: బీఏసీలో చర్చించకుండా: బహిరంగ లేఖ
అమరావతి: శాసనసభ సమావేశాలను మరికొంతకాలం పాటు పొడిగించాలంటూ తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం పట్టుబట్టుతోంది. సోమవారం నాటి సమావేశాలను బహిష్కరించిన అనంతరం టీడీపీ ఎల్పీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాసింది. టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు సహా మరో ఇద్దరు ఈ లేఖపై సంతకాలు చేశారు. శాసనసభ సమావేశాలు ఇదివరకే ముగియాల్సి ఉన్నప్పటికీ.. దాన్ని పొడిగిస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా నిర్ణయాలను తీసుకుందని ఎమ్మెల్యేలు ఆరోపించారు.

బీఏసీలో చర్చించకుండానే..
సభా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఉద్దేశించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లో చర్చించకుండానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతంగా నిర్ణయాలను తీసుకుంటున్నారని టీడీఎల్పీ నేతలు విమర్శించారు. సమావేశాలను మరి కొంతకాలం పాటు పొడిగించాలిని తాము డిమాండ్ చేస్తున్నప్పటికీ.. పట్టించుకోవట్లేదని పేర్కాన్నారు. శాసనసభలో పలు బిల్లులపై చర్చించాల్సి ఉందని, మరికొన్ని సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వాటిపై చర్చించాల్సిన అవసరం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ సమావేశాలను పొడిగించేలా చర్యలు చేపట్టాలని వారు గవర్నర్ను అభ్యర్థించారు.

వికేంద్రీకరణ బిల్లు సహా..
అత్యంత కీలకమైన ఏపీ వికేంద్రీకరణ బిల్లు సహా పలు అంశాలు సెలెక్ట్ కమిటీ ఆధీనంలో ఉన్నాయని, వాటిని స్తంభింపజేయడం వల్ల రాష్ట్ర ప్రగతి కుంటుపడుతుందని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. శాసనసభ రూల్బుక్లోని 321 నిబంధన ప్రకారం.. శాసనసభలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ అది బిజినెస్ అడ్వైజరీ కమిటీకి లోబడి ఉండాలని, దీనికి వ్యతిరేకంగా అధికార పార్టీ ఏకపక్ష ధోరణిని అనుసరిస్తోందని ఆరోపించారు.

సమావేశాలను కొనసాగిస్తేనే..
ఇలాంటి పరిస్థితుల్లో శాసనసభ సమావేశాలను కొనసాగించి తీరాల్సిన అవసరం ఉందని టీడీపీఎల్పీ నేతలు స్పష్టం చేశారు. వికేంద్రీకరణ బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) రద్దు బిల్లులపై శాసనమండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తమ ప్రభుత్వంపై ప్రజా వక్యతిరేత వస్తుందనే భయం వల్లే అధికార పార్టీ తనకు అనుకూలంగా ఉన్నన్ని రోెజులు మాత్రమే సమావేశాలను పొడిగించుకుందని అన్నారు. ముఖ్యమంత్రి తీసుకునే ఏకపక్ష నిర్ణయాలకు చెంపపెట్టు కలిగించేలా సమావేశాలను పొడిగించడానికి అవసరమైన చర్యలను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
Recommended Video

సమావేశాల బహిష్కరణ అందుకే..
ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, బిల్లులను చర్చించడానికి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ నేతలుగా తాము సిద్ధంగా లేమని టీడీపీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కారణం వల్లే తాము సోమవారం నాటి శాసనసభ సమవేశాలను బహిష్కరించాల్సి వచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే వ్యతిరేక నిర్ణయాలపై తాము ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని అన్నారు. తాము చేసిన పలు కారణాలను పరిగణనలోకి తీసుకుని.. సభా సమావేశాలను పొడిగించాలని విజ్ఙప్తి చేశారు.












Click it and Unblock the Notifications