బాగుంటాయి:కేటీఆర్ నోట ఏపీ మాట, అయ్యన్నతో ఫ్రెండ్లీ
హైదరాబాద్: విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మంత్రులు నిత్యం విమర్శలు గుప్పించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, మంగళవారం ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు, తెలంగాణ పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావులు ఒకే వేదిక పైన కనిపించారు. వీరిద్దరి రాకతో వేదిక పైన ఫ్రెండ్లీ అట్మోస్మియర్ కనిపించింది.
మంగళవారం ఈ ఇద్దరు మంత్రులు టిప్పు అనే సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అయ్యన్న, కేటీఆర్లిద్దరు పరస్పరం నవ్వుతూ పలకరించుకున్నారు. అంతేకాదు, పరస్పరం ఒకింత ప్రశంసలు గుప్పించుకున్నారు. సినిమా పరిశ్రమకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఇరువురు మంత్రులు చెప్పారు.
విభజన అనంతరం సినిమా పరిశ్రమలో కొంత అనిశ్చితి ఏర్పడిందని, అయితే తామిద్దరం (కేటీఆర్, అయ్యన్నపాత్రుడు) ఇక్కడకు వచ్చామని, సినీ పరిశ్రమకు ఇరు ప్రభుత్వాలు అండగా ఉంటాయని, ఈ పరిశ్రమ పైన వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సినీ రంగానికి ప్రాధాన్యత ఇస్తుందని అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మంచి మంచి లోకేషన్స్ ఉన్నాయని చెప్పారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాదులో చిత్రపురిని నిర్మిస్తామని చెప్పారు. చెన్నై నుంచి హైదరాబాద్కు సినిమా పరిశ్రమ తరలి రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందని, ఇంకా పూర్తిగా నిలదొక్కుకోలేదన్నారు. ఇప్పుడు హైదరాబాద్ను అంతర్జాతీయ సినిమా లెవల్కు తీసుకు వెళ్తామన్నారు. అందుకు ముఖ్యులతో కలిసి తగిన విధంగా చర్చిస్తామని, కెసిఆర్ కూడా ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తారన్నారు.
వైజాగ్, అరకు వంటి ప్రాంతాల్లో కూడా ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సినిమా అభివృద్ధికి అక్కడ కృషి చేయాన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ సినిమా అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అవి తాత్కాలికమేనని చెప్పారు. సినీ పరిశ్రమకు చెందిన వారు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.