ఏపీపై ఈసారి చలిపులి పంజా- దీపావళి తర్వాత దారుణ పరిస్ధితులు- ఐఎండీ షాకింగ్
ఏపీలో ఈసారి చలిపులి పంజా తప్పేట్లు లేదు. అదీ గతంలో ఎన్నడూ చూడని విధంగా దారుణమైన కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రమాదం ఉందని భారత వాతావరణ చేసిన హెచ్చరికలు జనానికి వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. వాతావరణ మార్పులతో ఏర్పడిన లా నినా ప్రభావంతో ఈసారి కఠిన ప్రతికూల పరిస్ధితులు ఎధుర్కోవాల్సి వస్తుందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇప్పటికే దీని ప్రభావం మొదలైందని, ఏజెన్సీ ప్రాంతాల్లో పలు చోట్ల నమోదవుతున్న ఉష్ణోగ్రతలే ఇందుకు నిదర్శనమని చెబుతోంది. దీంతో రాబోయే రోజుల్లో చలి ప్రభావం ఎలా ఉంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ఏడాది ఏపీపై చలిపులి పంజా...
ఈ ఏడాది ఏపీపై చలిపులి పంజా తప్పేట్లు లేదు. పసిఫిక్ మహాసముద్రంలో గడ్డ కట్టిన నీటి పరిస్ధితులు, దానిపై నుంచి వీస్తున్న గాలులే ఇందుకు కారణం. వాతావరణ పరిభాషలో లా నినాగా అభివర్ణిస్తున్న ఈ పరిస్ధితి ప్రభావం సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన ఏపీపై తీవ్రంగా పడబోతోందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. లానినా ప్రభావంతో ఈ ఏడాది ఏపీ వ్యాప్తంగా చలి కాలం తీవ్ర కఠినంగా ఉండబోతోందని, కఠినమైన చలి గాలులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న జిల్లాల్లో జనం వణుకుతున్నారు. ఇప్పటికే ఈ ప్రభావం మొదలైందని అంచనా వేస్తున్నారు.
నవంబర్ 14 తర్వాత మొదలు...
నవంబర్ 14 తర్వాత శీతాకాలపు తీవ్ర చలి పరిస్ధితులు మొదలయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. తూర్పు పసిఫిక్ సముద్రంలో ఏర్పడిన చల్లటి నీటి పరిస్ధితులు, వాటిపై నుంచి వీస్తున్న గాలులు నవంబర్ 14 కల్లా ఏపీపై ప్రభావం చూపుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే వారం నుంచి ఇవి మరింత తగ్గిపోవడం ఖాయమని వాతావరణ విభాగం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. నవంబర్ 14న దీపావళి తర్వాత దారుణమైన చలిగాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు.
నిర్ధారించిన రాష్ట్ర ప్రభుత్వం...
రాష్ట్రంలో లానినా ప్రభావంతో శీతాకాలపు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సంస్ధ అయిన ఏపీ స్టేట్ డెవలప్మెంట్, ప్లానింగ్ సొసైటీ కూడా నిర్దారించింది. రాష్ట్రంలో పలు చోట్ల 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు సొసైటీ అధికారులు తెలిపారు. జిల్లాల్లో వేగంగా మారుతున్న వాతావరణ పరిస్ధితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న సొసైటీ.. పలు చోట్ల పడిపోతున్న ఉష్ణోగ్రతలను ప్రస్తావిస్తోంది. శ్రీకాకుళం ఏజెన్సీలో గత 24 గంటల్లో ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సీతంపేటలో అయితే 14.6 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయనట్లు సొసైటీ తెలిపింది.
కరోనా వ్యాప్తి, సీజనల్ వ్యాధులకు అవకాశం
ఏపీలో ఈ ఏడాది శీతాకాలంలో భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో కరోనా వ్యాప్తితో పాటు పలు సీజనల్ రోగాలూ వచ్చే ప్రమాదం పొంచి ఉందని వైద్యారోగ్యశాఖ చెబుతోంది. దీంతో ప్రజలను ఇప్పటినుంచే అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు పంపుతోంది. కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు పరిస్ధితులను తెలుసుకుంటూ ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు వెళ్లాయి. ప్రస్తుతం కరోనా కాస్త నెమ్మదించినట్లు రాష్ట్ర ప్రభుత్వం రోజూ విడుదల చేస్తున్న హెల్త్ బులిటెన్లు చెబుతున్నప్పటికీ తీవ్ర చలి పరిస్ధితుల వల్ల తిరిగి పుంజుకునే ప్రమాదం లేకపోలేదని కోవిడ్ రాష్ట్ర నోడల్ ఆఫీసర్ రాంబాబు తెలిపారు.