ముందస్తుకు సిద్ధం కానీ, అక్కడ: చంద్రబాబు, రాష్ట్రపతితో విజయసాయి భేటీ
అమరావతి: ఏపీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోందని, జమిలి ఎన్నికలకు వెళ్లే యోచన చేస్తున్నారన్నారు.
లోకసభకు కేంద్రం ముందస్తు ఎన్నికలు నిర్వహించినా, రాష్ట్ర శాసనసభకు మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి శాసనసభకు కూడా ముందుగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తే న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ మేరకు ఆయన గురువారం గుంటూరు జిల్లా నేతలతో భేటీ అయిన సమయంలో మాట్లాడారు.

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపిచ్చారు. లోకసభకు కేంద్రం ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తామంటే మనకు అభ్యంతరం లేదని, అసెంబ్లీకి కూడా ముందస్తు ఎన్నికలు జరుపుతామంటే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. షెడ్యూల్ ప్రకారమే మన శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. జమిలిగా అక్టోబర్, నవంబర్ నెలలో అసెంబ్లీకి ఎన్నికలు పెట్టాలని చూస్తే న్యాయపరమైన మార్గాలు అన్వేషిద్దామన్నారు.

సభ విజయోత్సాహం
వివిధ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 75 బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇందులో 25 రైతు సభలు, 25 మహిళా సభలు, 25 సంక్షేమ సభలు ఉంటాయన్నారు. ఇటీవల నెల్లూరులో నిర్వహించిన దళితతేజం బహిరంగ సభ విజయవంతమైందని, దళిత వర్గాల్లో టీడీపీ ప్రతిష్ఠను పెంచిందన్నారు. దీనిస్ఫూర్తితో త్వరలో నిర్వహించే ముస్లిం మైనారిటీ సదస్సును కూడా విజయవంతం చేయాలన్నారు.
రాష్ట్రపతిని కలిసిన విజయసాయి రెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రెండు రోజుల క్రితం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా గురువారం వెల్లడించారు. 4న రాష్ట్రపతిని కలిశానని, తన పుస్తకం 'గ్లోరీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర'ను బహూకరించానని, రాష్ట్రపతిని కలవడం ఎప్పటిలాగే గౌరవంగా, ఆనందంగా ఉందని, నేర్చుకోవడంలో గ్లోరీ ఆఫ్ లార్డ్ వేంకటేశ్వర పుస్తకం ఒక గొప్ప అనుభవమని చెప్పారు.

175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాల్లో పోటీ
ఏపీలో రైతులు కష్టానికి తగిన ప్రతిఫలం అందక ఏడుస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం ఆనంద ఆదివారాలు నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం ప్రశ్నించారు. కడప ఉక్కు పరిశ్రమ సహా హామీలన్నింటిని నేరవేర్చటానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రం అందుకు సంబంధించిన సమాచారాన్ని అందిచకుండా తాత్సారం చేస్తోందన్నారు. సహకారరంగాన్ని నిర్వీర్యం చేసి కార్మికులు రోడ్డున పడేలా చేస్తున్న ప్రభుత్వం కేంద్రాన్ని నిందిస్తూ నయవంచన దీక్షలు పెట్టడమేమిటన్నారు. కేంద్రం అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం అవినీతి కార్యకలాపాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 స్థానాలకు పోటీ చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications