అదే స్ఫూర్తితో: బెజవాడ ఆటోనగర్లో 'అన్న' క్యాంటిన్, ఖర్చు 3.5 కోట్లు
అమరావతి: తమిళనాడులోని పేద ప్రజలకు, కార్మికులకు తక్కువ ఖరీదుకు రుచికరమైన, పౌష్టికాహారాన్ని ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటిన్ల ద్వారా అందిస్తున్న సంగతి తెలిసిందే. పేద ప్రజల ఆకలిని తీర్చటంలో అమ్మక్యాంటిన్లు విజయవంతమయ్యాయి.
అంతేకాదు జయలలిత రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని ఆధిరోహించడంలో అమ్మ క్యాంటిన్లు ఎంతో కీలక పాత్ర పోషించాయని రాజకీయ విశ్లేషకులు సైతం వెల్లడించారు. అదే స్ఫూర్తితో ఆటోనగర్లోని కార్మికులకు సబ్సిడీతో కూడిన భోజనాన్ని తక్కువ ఖరీదుకే అందించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని భావిస్తున్నారు.
తక్కువ ఖర్చుతో పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో విజయవాడలోని ఆటోనగర్లోని కార్మికుల కోసం 'అన్న క్యాంటిన్' ను ఏర్పాటు చేస్తున్నారు. ఆటోనగర్లోని ఎన్టీఆర్ స్మృత్యర్థం అన్న క్యాంటిన్ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ క్యాంటీన్ ఏర్పాటు కోసం 3.5 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
అన్న క్యాంటీన్ కోసం ఆటోనగర్లోని ఓ ప్రైవేట్ వ్యక్తికి చెందిన భూమిని ఆరు సంవత్సరాలకు లీజుకు తీసుకున్నారు. నగర కమిషనర్ ఆటోనగర్కు సమీపంలో ప్రభుత్వ భూమని ఇచ్చినట్లైతే అక్కడే శాశ్వతంగా పక్కా భవనంలో క్యాంటిన్ ఉండేలా ఏర్పాటు చేయాలని ఎంపీ నాని భావిస్తున్నారు.
ఆటోనగర్లో దాదాపు లక్షా 25వేల మంది కార్మికులున్నారు. వారందరికి ఈ క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడనుంది. తాత్కాలిక క్యాంటీన్ నిర్మాణం కోసం ఎంపీ నాని కేశినేని ట్రస్ట్ తరుపున రూ. 10 లక్షలు విరాళంగా ప్రకటించారు. ప్రతిరోజూ రెండు వేల మందికి సబ్సిడీతో పౌష్టికాహారాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఈ క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను ఇస్కాన్ బెంగుళూరుకు చెందిన అక్షయ పాత్రకు అప్పగించారు. ఆగస్టు మొదటి వారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదగా ఈ అన్న క్యాంటిన్ను ప్రారంభించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని భావిస్తున్నారు.
తక్కువ ఖర్చుతో పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో విజయవాడలోని ఆటోనగర్లో 'అన్న క్యాంటిన్' ను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్ స్మృత్యర్థం అన్న క్యాంటిన్ ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. క్యాంటిన్ ఏర్పాటు కోసం 3.5 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసారు. ఈ క్యాంటిన్ నిర్వహణ బాధ్యతలను ఇస్కాన్ బెంగళూరుకు చెందిన అక్షయ పాత్రకు అప్పగించారు.