IRCTC మొత్తం ఆన్లైన్ సిస్టమ్ క్లీన్ స్వీప్! జూలై 15 నుంచి సరికొత్తగా..
రైలు ప్రయాణికులకు నిరంతరం చికాకు తెప్పించే ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించబోతోంది. మరింత వేగంగా, సులభంగా టికెట్లు బుక్ చేసుకునేలా సరికొత్త సాంకేతికతతో రూపొందించిన కొత్త IRCTC వెబ్సైట్ను జూలై 15 నాటికి ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంచలన ప్రకటన చేశారు. జైపూర్లోని మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNIT)లో విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
విద్యార్థి ఫిర్యాదు.. స్పాట్లోనే అధికారికి మంత్రి ఫోన్!
ఈ సమావేశంలో ఒక విద్యార్థి లేచి, "సార్, ప్రతిరోజూ లక్షలాది మంది వాడే ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఈ 'క్యాప్చా' (Captcha) సమస్య చాలా వేధిస్తోంది.. దయచేసి దీనికి పరిష్కారం చూపండి" అని మంత్రిని కోరాడు. విద్యార్థుల ఇబ్బందిని అర్థం చేసుకున్న మంత్రి అశ్విని వైష్ణవ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా, అందరి ముందే వేదికపై నుంచే రైల్వే విభాగానికి చెందిన ఉన్నతాధికారికి లైవ్ ఫోన్ కాల్ చేశారు.

#WATCH | On students’ demand, Union Railway Minister announces new IRCTC website to be launched by 15th July pic.twitter.com/fjX6z6vyj1
— ANI (@ANI) June 11, 2026
"ఇక్కడున్న విద్యార్థులంతా సరికొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. రాబోయే 30 రోజుల్లో కొత్త వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురాగలమా?" అని మంత్రి సదరు అధికారిని ప్రశ్నించారు. అధికారుల నుంచి సానుకూల సమాధానం రావడంతో, జూలై 15 కల్లా కొత్త వెబ్సైట్ లాంచ్ అవుతుందని మంత్రి ప్రకటించగా.. విద్యార్థులంతా హర్షధ్వానాలు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
తత్కాల్ బుకింగ్స్, ఓటీపీ సమస్యలకు చెక్!
సాధారణంగా పీక్ అవర్స్లో, ముఖ్యంగా ఉదయం తత్కాల్ (Tatkal) బుకింగ్స్ సమయంలో ఐఆర్సీటీసీ వెబ్సైట్ సర్వర్లు డౌన్ అవ్వడం, ఓటీపీలు సకాలంలో రాకపోవడం, ట్రాఫిక్ జామ్ కావడం వంటి సమస్యలపై ప్రయాణికుల నుంచి ఎప్పటి నుంచో ఫిర్యాదులు ఉన్నాయి. 2002లో ఆన్లైన్ రిజర్వేషన్లు ప్రారంభం కాగా, ప్రస్తుతం దేశంలో దాదాపు 88% టికెట్ బుకింగ్స్ కౌంటర్ల వద్ద కాకుండా ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి.
కాగా, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు గత ఏడాది జూలై నుంచి తత్కాల్ స్కీమ్ కింద టికెట్లను కేవలం అధికారిక గుర్తింపు ధృవీకరణ పొందిన వినియోగదారులకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే భద్రతా చర్యల్లో భాగంగా 2025 క్యాలెండర్ సంవత్సరంలో ఐఆర్సీటీసీ నిబంధనలు ఉల్లంఘించిన 3.04 కోట్ల యూజర్ అకౌంట్లను శాశ్వతంగా నిలిపివేయగా, 2.94 కోట్ల అకౌంట్లను తాత్కాలికంగా సస్పెండ్ చేసి రీ-వాలిడేషన్ ఆప్షన్ ఇచ్చారు.
రైలు భోజనంపై 'ఏఐ' (AI) నిఘా.. సెంట్రల్ వార్ రూమ్ రెడీ!
వెబ్సైట్ మార్పులతో పాటు రైళ్లలో సరఫరా అయ్యే ఆహార నాణ్యత, పరిశుభ్రతపై కూడా రైల్వే శాఖ గట్టి చర్యలు చేపట్టింది. ఇందుకోసం బేస్ కిచెన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత మానిటరింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టినట్లు ఐఆర్సీటీసీ వెల్లడించింది.
2,394 ఏఐ కెమెరాలు: దేశవ్యాప్తంగా ఉన్న 800కు పైగా ఐఆర్సీటీసీ కిచెన్లను... 2,394 ఏఐ ఆధారిత కెమెరాలతో అనుసంధానించారు.
కేంద్ర పర్యవేక్షణ: ఈ కెమెరాల ద్వారా జరిగే వంట ప్రక్రియను న్యూఢిల్లీలోని సెంట్రల్ వార్ రూమ్ నుంచి 24 గంటల పాటు నిరంతరం పర్యవేక్షిస్తారు.
9 రకాల లోపాల గుర్తింపు: ఆహారం అపరిశుభ్రంగా మారడానికి కారణమయ్యే 9 రకాల లోపాలను (ఉదాహరణకు వండేవారు మాస్కులు, గ్లోవ్స్ వేసుకోకపోవడం, ఈగలు వాలడం వంటివి) ఈ ఏఐ సిస్టమ్ వెంటనే గుర్తించి అధికారులను అలర్ట్ చేస్తుంది. ఈ సాంకేతికతతో రైలు ప్రయాణాల్లో నాణ్యమైన భోజనం అందుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications