కరోనా కాటు: తిరుపతిలో ఈ ఏడాది ఆ వైభవం కనుమరుగైనట్టేనా: రద్దా? వాయిదా?:
తిరుపతి: కరనా వైరస్ ప్రభావం వల్ల ఇప్పటికే తిరుమలలోని శ్రీవారి ఆలయంలో భక్తుల దర్శనాలను నిలిపివేశారు. స్వామివారికి నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నప్పటికీ.. భక్తుల రాకను నిషేధించారు. తాజాగా- మరో వైభవాన్ని కోల్పోనున్నారు తిరుపతివాసులు. ఏటేటా వారంరోజుల పాటు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించే గంగమ్మ జాతర రద్దు కానుంది. కరోనా వైరస్ వల్ల ఈ ఏడాది గంగమ్మ జాతరను రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. తిరుపతికి చెందిన భక్తులు మాత్రం ఈ జాతరను వాయిదా వేయాలని కోరుతున్నారు.
తిరుపతి తాతయ్య గుంటలో వెలసిన గంగమ్మ అమ్మవారికి ఏటా మేలో వారం రోజుల పాటు జాతరను నిర్వహిస్తారు. తిరుపతి గంగమ్మ జాతరగా ఇది ప్రఖ్యాతి చెందింది. వచ్చేనెల 5వ తేదీన చాటింపుతో ఆరంభం అయ్యే గంగమ్మ జాతర 12వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. రోజూ ఒక్కో వేషధారణతో వారంరోజుల పాటు అత్యంత వైభవంగా దీన్ని నిర్వహిస్తుంటారు. జాతర నాలుగో రోజున టీటీడీ అధికారులు ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు శ్రీవారి తరఫున అమ్మవారికి సారె అందజేయడం ఆనవాయితీ. రాయలసీమలోనే అతిపెద్ద జాతరగా దీనికి గుర్తింపు ఉంది. తమ గ్రామదేవతగా గంగమ్మ తల్లిని కొలుస్తుంటారు తిరుపతివాసులు.

దేశ, విదేశాల్లో స్థిరపడిన చిత్తూరు జిల్లావాసులు గంగమ్మ జాతరను దర్శించుకోవడానికి వస్తుంటారు. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ గ్రామోత్సవంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల ఈ సారి గంగమ్మమ అమ్మవారి జాతర రద్దయింది. గంగమ్మ జాతరను రద్దు చేయడం సరి కాదని, వాయిదా వేయాలని భక్తులు కోరుతున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఈ జాతరను నిర్వహించడానికి అందుబాటులో గల అవకాశాలను పరిశీలించాలని చెబుతున్నారు. జాతర మొత్తాన్నీ రద్దు చేయడం కంటే వాయిదా వేయడం మేలు మంచిదని అంటున్నారు.












Click it and Unblock the Notifications