క్వారీల పేరిట మన్యం ధ్వంసం చేస్తున్న టిడిపి నేతలు...తరిమికొట్టండి:మావోయిస్టుల లేఖ
విశాఖపట్టణం:టిడిపి నేతలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు తాజాగా విడుదల చేసిన మరో లేఖ సంచలనం సృష్టిస్తోంది. క్వారీల ముసుగులో గిరిజనుల పంట భూములను స్వాధీనం చేసుకునేందుకు టిడిపి నేతలు కుట్ర చేస్తున్నారని మావోలు ఆ లేఖలో ఆరోపించారు.
మావోయిస్టు ఈస్ట్ డివిజన్ గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి గోపి పేరుతో ఈ లేఖను విడుదల అయింది. మన్యాన్ని ధ్వంసం చేస్తున్న టీడీపీ నాయకులను తరిమి కొట్టాలని మావోయిస్టులు ఆ లేఖలో పిలుపునిచ్చారు. అలాగే ఇదే విషయమై లేఖలో ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసులు మారుమూల గిరిజనులు రేషన్, ఆధార్ కార్డులు తీసుకుని స్టేషన్లకు రావాలని వేధిస్తున్నారనీ, స్టేషన్లకు వచ్చిన వారిని ఇన్ఫార్మర్లగా పనిచేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
తెలుగు దేశం పార్టీ నాయకులు, వారి బంధువులు మన్యంలో క్వారీల పేరిట ఆదివాసీల పంట భూములను ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి గోపి పేరిట విడుదలైన లేఖలో మావోయిస్టులు ఆరోపణలు చేశారు. బుధవారం మావోయిస్టుల పేరిట ఈ 5 పేజీల సుదీర్ఘ లేఖ విడుదల అయింది.
టిడిపి నేతలు మన్యంలో లేటరైట్ పేరుతో బాక్సైట్ ను తరలిస్తున్నారని,గిరిజన సంపదను దోచుకుంటున్నారని మావోయిస్టులు పేర్కొన్నారు. దీనికి అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. క్వారీ లీజులను వెంటనే ఆపాలని, గనులను తవ్వుకుపోతున్న నేతలను తరిమికొట్టాలని మావోలు పిలుపు నిచ్చారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను బహుళజాతి కంపెనీలకు ధారాదత్తం చేశారని విమర్శించారు. చంద్రబాబు మోసపూరిత ప్రకటనలతో మరోసారి అధికారంలోకి రావాలని పాకులాడుతున్నారని మావోలు ఆ లేఖలో ఆరోపించారు.
పోలీసులు గతంలో పట్టుకుని అరెస్టు చేసిన వారిని, లొంగిపోయిన వారిని కూడా తిరిగి తీసుకెళ్తున్నారన్నారనీ...సీలేరు ఎస్ఐ విభూషణరావు, కొయ్యూ రు, మంప, గూడెం ఎస్ఐలు, సీఐలు ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారన్నారని ఆరోపించారు. గిరిజన ఓట్లతో గెలిచి వారికే వెన్నుపోటు పొడుస్తున్న పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరితోపాటు మణికుమారి, బొర్రా నాగరాజు, ఎం.వి.వి.ఎస్ ప్రసాద్, ముక్కల మహేశ్, వెంగలయ్య, బేతాళుడు, నాజర్వల్లి, కొర్రా బలరాం, లోకులగాంధీ లాంటి వారు పదవులు కోసం పాకులాడుతున్నారన్నారు. వీళ్లెవరూ ఆదివాసీలపై పోలీసులు చేస్తున్న దాడులపై మాట్లాడడం లేదన్నారు. పోలీసు దాడులను ఆపకుంటే ప్రజల చేతిలో టీడీపీ, బీజేపీ నేతలు ఆగ్రహానికి గురికాక తప్పదని గోపి లేఖలో హెచ్చరించారు.