మరో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు
కడప: ఎర్రచందనం స్మగ్లింగ్ లావాదేవీల్లో కీలకపాత్ర పోషించిన మణి అన్నన్ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని పోలీసులు దేశరాజధాని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు దేశవ్యాప్తంగా వేట సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మణి అన్నన్ వారి చేతికి చిక్కాడు.
కడప పోలీసుల అదుపులో ఉన్న ముఖేష్ బదానీ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మణిని అరెస్టు చేశారు. తమిళనాడు, ఏపీలో ఎర్రచందనం సరఫరాలో మణి కీలకపాత్ర పోషించాడని సమాచారం. మంగళవారంనాడు మణిని పోలీసులు కోర్టులో ప్రవేశపెడుతారు.
తమిళనాడుకు చెందిన మణి ఢిల్లీ ఉంటూ లావాదేవీలు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పలువురు బడా ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ముఖేష్ బదానీ కూడా అత్యంత ముఖ్యుడు. అతన్ని తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాల్లో సినీ నటి నీతూ అగర్వాల్ను, రాజకీయ నేత మస్తాన్ వలీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరింత మంది అంతర్జాతీయ స్మగ్లర్లను కూడా అరెస్టు చేశారు. వారి నుంచి అన్ని రకాల సమాచారాలు సేకరిస్తూ పోలీసులు దేశవ్యాప్తంగా ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.