టిడిపి నేతలకు సమాధానం చెప్పు, తెగబలిసిన..: బాబుకు భూమన హెచ్చరిక
చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఇతర నేతల ఆరోపణలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జవాబివ్వాలని హెచ్చరిస్తున్నానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం నాడు అన్నారు.
విజయవాడ: చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఇతర నేతల ఆరోపణలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జవాబివ్వాలని హెచ్చరిస్తున్నానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం నాడు అన్నారు.
ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని టిడిపి నేతలే చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గమూ సంతోషంతో లేదని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు.
పవన్ కళ్యాణ్ ప్రశ్నించొచ్చు, నిలదీస్తాం: బాబుకు వీర్రాజు ఝలక్
ఎంపీ శివప్రసాద్తో పాటు పలు అంశాలపై బోండా ఉమామహేశ్వర రావు, బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ నాయుడు తదితరులు ప్రశ్నిస్తున్నారని వారికి సమాధానం చెప్పాలన్నారు.
శివప్రసాద్కు జవాబివ్వండి
చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం నారా లోకేష్ మాత్రమే సంతోషంగా ఉన్నారని చెప్పారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చేసిన ఆరోపణలపై టిడిపి సమాధానం చెప్పాలన్నారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబుకు ఎన్ని డాక్టరేట్లు ఇచ్చినా తక్కువేనని టిడిపి వాళ్లే చెప్పుకుంటున్నారన్నారు.
లోకేష్ సంతోషంగా ఉన్నాడు
చంద్రబాబు వల్ల లోకం సంతోషంగా లేదని, లోకేష్ మాత్రం సంతోషంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని దళితులందరి మనస్సులను చంద్రబాబు గాయపరిచారన్నది నిజం అని చెప్పారు. నమ్మినవారిని నట్టేట ముంచడం చంద్రబాబుకు అలవాటు అన్నారు.
దళిత ఎంపీ శివప్రసాద్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. తనకు సంబంధించి కొత్తగా వచ్చిన దళిత మంత్రులతో తిట్ల దండకం చంద్రబాబు చెప్పించారన్నారు.
తెగబలిసిన...
మా పార్టీ నుంచి గెలిచిన సభ్యులను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి, ఆ తెగబలిసిన సభ్యులతో మమ్మల్ని తిట్టించారని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు మీ పార్టీ వాళ్లే తిడుతున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారని, తండ్రిగా మాత్రమే విజయం సాధించారన్నారు.
చంద్రబాబుపై అసంతృప్తి జ్వాలతో పలువురు టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారని, దానిపై సమాధానం చెప్పాలన్నారు. బీసీలకు, కాపులకు, దళితులకు జరుగుతున్న అన్యాయం, మోసం, వారు సంధించిన ప్రశ్నలకు సమాధానం ఏది అన్నారు.
హెచ్చరిస్తున్నా...
ప్రజలు సంతృప్తి చెందేలా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని చెబుతూ, హెచ్చరిస్తున్నానని చెప్పారు. అతి తొందరలోనే చంద్రబాబుకు మరింత ప్రజాప్రతినిధులు గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని భావిస్తున్నామన్నారు.
చంద్రబాబుపై ఎవరైనా సద్విమర్శ చేస్తే వాటికి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారన్నారు. ఆ అంశాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయడం చంద్రబాబుకు ఉన్న సంప్రదాయం అన్నారు.