తిరుమల శ్రీవారి ఆలయ భద్రతకు యాంటీ డ్రోన్ సిస్టమ్ .. దేశానికి డ్రోన్ల దాడుల భయంతో అలెర్ట్ అయిన టీటీడీ
భారతదేశంలో ఉగ్ర మూకలు డ్రోన్ల దాడులకు తెగబడతారని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చారిత్రక స్థలాలపై, ఆలయాలపై ప్రత్యేకమైన దృష్టిసారించింది కేంద్రం. రాష్ట్రాలవారీగా ఇప్పటికే అలర్ట్ చేసింది. భారత సరిహద్దుల్లో, జమ్మూలో నిత్యం డ్రోన్ల సంచారం కలకలం రేపుతోంది. ఇక ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎప్పుడైనా, ఎక్కడైనా విధ్వంసాలకు పాల్పడవచ్చని, డ్రోన్ల సాంకేతికతను ఉపయోగించి దాడులకు తెగబడవచ్చని భావిస్తున్న నేపధ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అలెర్ట్ అయింది .
Recommended Video

త్వరలో తిరుమలలో డిఆర్డిఓ యాంటీ-డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ బోర్డు తిరుమలలో భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడానికి రంగంలోకి దిగింది. ఉగ్ర కుట్రలను టెక్నాలజీతో తిప్పికొట్టడానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీని తిరుమల కొండ పైన ఉపయోగించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ) యాంటీ-డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే దేశంలో మొట్టమొదటి ఆలయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిలువనుంది.

జమ్మూలో ఉగ్రదాద డ్రోన్ల దాడుల తర్వాత యాంటీ డ్రోన్ సిస్టం తయారీలో డీఆర్డీవో
జూన్లో జమ్మూలోని ఒక వైమానిక దళంపై ఉగ్రవాద దాడి తరువాత, డిఆర్డిఓ తన డ్రోన్ వ్యతిరేక వ్యవస్థను కర్ణాటకలోని కోలార్ వద్ద జూలై 6 న ప్రదర్శించింది. తాము తయారు చేసిన మూడు రకాల టెక్నాలజీలను ప్రదర్శించింది. టిటిడి విజిలెన్స్ మరియు సెక్యూరిటీ వింగ్ చీఫ్, గోపీనాథ్ జట్టి, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీసు శాఖల ప్రతినిధులతో పాటుగా ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. డిఆర్డిఓ యాంటీ డ్రోన్ వ్యవస్థకు డిటెక్షన్, జామింగ్, కౌంటర్మెజర్లు ఉంటాయి. దీని ధర 22 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.

డీ ఫోర్ డ్రోన్ వ్యవస్థతో డ్రోన్ల గుర్తింపు .. ధ్వంసం చేసే టెక్నాలజీ కూడా
నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదకరమైన డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేసే టెక్నాలజీని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. డీ ఫోర్ డ్రోన్ వ్యవస్థగా పిలిచే దీనిద్వారా డ్రోన్ దాడుల ముప్పు నుంచి దేశాన్ని రక్షించుకోవచ్చని తెలుస్తుంది. ఇక ఈ వ్యవస్థ నాలుగు కిలోమీటర్ల పరిధిలోని ప్రమాదకర డ్రోన్స్ ను గుర్తించే సెన్సార్లు, విధ్వంసం చేసే పరికరాలు ఉంటాయి. గతంలో అనేకమార్లు తిరుమల శ్రీవారి ఆలయం భద్రత విషయంలో వార్తలు వచ్చాయి. గతంలో ఆలయంపై విమానం చక్కర్లు కొట్టిందని, అప్పట్లో పలువురు ఆందోళన సైతం వ్యక్తం చేశారు.

టీటీడీ సంకల్పం ... యాంటీ డ్రోన్ వ్యవస్థ తో ఆలయ రక్షణకు శ్రీకారం ..
ఇక దేశ సరిహద్దులలోనూ ఇటీవల కాలంలో జమ్ము లోని వైమానిక స్థావరం పై జరిగిన డ్రోన్ దాడి, ఆ తర్వాత వరుసగా డ్రోన్స్ తిరుగుతున్న పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ తిరుమల శ్రీవారి ఆలయానికి రక్షణకు సంకల్పించింది. టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఆదేశాలతో ఈవో జవహర్ రెడ్డి యాంటీ డ్రోన్ టెక్నాలజీని కొనుగోలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మరికొద్ది రోజుల్లో శ్రీవారి ఆలయంలో యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు కానుంది.












Click it and Unblock the Notifications