బందరు టెక్కీ హత్య: దర్యాప్తుపై షిండేతో తండ్రి భేటీ
న్యూఢిల్లీ: ముంబైలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈస్తర్ అనూహ్య తండ్రి శింగవరపు ప్రసాద్ శుక్రవారం కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు నత్త నడకన సాగుతున్నారనే ఉద్దేశంతో ఆయన షిండేను కలిశారు. తన కూతురిని హత్య చేసినవారిని పట్టుకుని శిక్షించాలని ఆయన షిండేను కోరారు. అనూహ్య హత్య కేసుపై దర్యాప్తును వేగవంతం చేయాలని సూచిస్తూ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్కు ఆయన ఆ లేఖ రాశారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని ఆయన సూచించారు.
కేసు దర్యాప్తును వేగవంతం చేసి దోషులకు శిక్ష పడేలా చూడాలని ఆయన కోరారు. కృష్ణా జిల్లా మచిలిపట్నానికి చెందిన అనూహ్య ఈ నెల 4వ తేదీన మచిలీపట్నం నుంచి ముంబైకి బయలుదేరి వెళ్లింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఆమె మృతదేహం జనవరి 16వ తేదీన ముంబైలోని కుంజుర్ మార్గ్ వద్ద కనిపించింది.
అనూహ్య హత్య కేసులో పోలీసులు ఐదుగురిని పట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని తేలింది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసుల తీరుపై అనూహ్య కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో క్రైస్తవ సమాజానికి చెందినవారు కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహించారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆంధ్రప్రదేశ్లోని బందరుకు చెందిన టెక్కీ అనూహ్య సంఘటనపై ప్రభుత్వం తీరును నటి, దర్శకురాలు పూజాభట్ తప్పు పట్టారు. ప్రభుత్వ యంత్రాంగంపై నిప్పులు కురిపించారు. తమను రక్షించడానికే ప్రభుత్వ యంత్రాంగం ఉందని చెప్పాల్సిన అవసరం ఉందని, ఆ పనిచేస్తున్నారా అని అడగాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.