ఏపీ పది, ఇంటర్ పరీక్షలు జులైలోనే, డీఎస్సీ అభ్యర్థులకు త్వరలో పోస్టింగ్స్: ఆదిమూలపు సురేష్
అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో జులైలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Recommended Video
జులై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ చెప్పారు. జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందని ఆయన తెలిపారు. విద్యార్థుల ప్రయోజనం కోసమే పరీక్షలు నిర్వహణ అని స్పస్టం చేశారు.

కాగా, ఇంటర్ పరీక్షలకు 10 లక్షల మందికిపై విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 15 రోజుల ముందుగానే షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జూన్ 20 వరకు కరోనా కర్ఫ్యూ అమలులో ఉన్న విషయం తెలిసిందే. జులైలో ఇంటర్ పరీక్షలు పూర్తయితే, ఆగస్టులో ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ, ఇతర ఉమ్మడి పోటీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక సెప్టెంబర్ నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
టీడీపీ హయాంలో డీఎస్సీ అభ్యర్థులను పట్టించుకోలేదని, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. డీఎస్సీ 2008 సమస్య 13 ఏళ్లుగా పెండింగ్లో ఉందన్న ఆయన.. అభ్యర్థుల భవితవ్యంపై సీఎం జగన్ మానవతా దృక్పథంతో వ్యవహరించారని తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి చెప్పారు. త్వరలోనే డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని సురేష్ తెలిపారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమకు పోస్గింగ్స్ ఇవ్వడం పట్ల అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్కు ధన్యవాదాలు చెప్పారు.
కాగా, ఏపీలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 96,153 నమూనాలను పరీక్షించగా.. 5,741 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా నమోదైన 5741 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,20,134కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 53 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 12,052కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 10,567 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 17,32,948కి చేరింది.
ప్రస్తుతం 75,134 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,06,34,891 కరోనా నమూనాలను పరీక్షించారు.












Click it and Unblock the Notifications