సీఎం జగన్ కొత్త వ్యూహాలతో - నేటి నుంచే అసెంబ్లీ : వివేకా కేసు - అమరావతితో సహా..!!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి జరగనునున్నాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. గవర్నర్గా ఆయన బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు. కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్ సమావేశాల సమయంలో వర్చువల్ విధానంలో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాత బీఏసీ సమావేశం జరగనుంది.

బీఏసీలోనే అజెండా ఫిక్స్
అందులో సమావేశాల నిర్వహణ - అజెండా పైన నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిపక్షాలు ప్రస్తావించే అంశాలతో పాటుగా అధికార వైసీపీ సైతం కొన్ని అంశాల పైన చర్చ కోరుకుంటోంది. ప్రభుత్వం నుంచి దాదాపు 20 బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. బీఏసీ సమావేశంలో టీడీపీ ఏ అంశం పైన చర్చ కోరినా..చర్చకు సిద్దంగా ఉన్నామని చెప్పేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉంది. ఇక, బీఏసీ తరువాత ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సమావేశాల్లో ప్రతిపాదించే బిల్లులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అదే విధంగా మూడు రాజధానుల బిల్లలతో పాటుగా ప్రభుత్వ వైఖరి పైనా సీఎం మంత్రులకు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.

గౌతమ్ కు సంతాపం
ఇక, 8వ తేదీన హఠాన్మరణం చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డికి సభలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఆ తరువాత మహిళా దినోత్సవం సందర్బంగా.. మహిళా సభ్యుల ప్రసంగాలతో సభ కొనసాగనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం, గురువారం శాసనసభలో చర్చించడంతోపాటు సీఎం వైఎస్ జగన్ సమాధానం ఇవ్వనున్నారు. శుక్రవారం శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జిల్లాల ఏర్పాటు..పరిపాలనా వికేంద్రకరణ అంశాల పైన సభలో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాదాలు తెలిపే సమయంలోనే ప్రతిపక్షాల ఆరోపణలు అన్నింటికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

అన్నింటికీ సీఎం సమాధానం
అదే విధంగా ప్రధానంగా వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో ప్రభుత్వం శాసనసభా వేదికగా ప్రతిపక్షాల ఆరోపణల పైన స్పందించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక, మూడు రాజధానుల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాల పైన న్యాయ - శాసన అధికార పరిధి పైన చర్చ చేయాలని సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్ కు లేఖ రాసారు. దీని పైన బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, మూడు రాజధానుల పైన ప్రభుత్వం మరోసారి బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉందని అధికార పార్టీలో చర్చ సాగుతుతోంది.

రాజధానుల వ్యవహారం పై క్లారిటీ
కానీ, న్యాయ పరంగా చిక్కులు రాకుండా ప్రభుత్వం ఈ విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా సీఎం జగన్ తనను వ్యక్తిగతంగా ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తూ.. విమర్శలు చేస్తున్న అంశాల పైన మాత్రం స్పష్టమైన సమాధానం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. టీడీపీ అధినేత..ప్రతిపక్ష నేత చంద్రబాబు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించారు. దీంతో..ఈ సమావేశాలు రాజకీయంగా వేడి పుట్టించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications