అసెంబ్లీలో ఎమ్మెల్యేలు: చొక్కాలు పట్టుకుని బాహాబాహీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో మంగళవారం తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళం కారణంగా స్పీకర్ కోడెల శివప్రసాద రావు సభను బుధవారానికి వాయిదా వేశారు. తెలుగుదేశం శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్, వైయస్సార్ కాంగ్రెసు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘర్షణకు దిగారు. తోపులాటకు దిగారు. చొక్కాలు పట్టుకుని కొట్టుకోబోయారు. అయితే, మిగతా శాసనసభ్యులు వారిని వారించారు.
స్పీకర్ సభను వాయిదా వేసిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలపై తక్షణం చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు పట్టుబడుతూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. వైయస్ జగన్కు, మంత్రులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. జగన్ కుటుంబాన్ని ఫ్యాక్షనిస్టు కుటుంబంగా మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించగా, దేవినేని రంగా హత్యతో చంద్రబాబుకు సంబంధం ఉందని చంద్రబాబు ఆరోపించారు.

జగన్ వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. హత్యారాజకీయాలపై చర్చ జరగాలని పట్టుబడుతూ వైయస్ జగన్ - మనుషుల ప్రాణాల కన్నా ఇంకా ముఖ్యమైన అంశం ఏమైనా ఉంటుందా అని జగన్ అడిగారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతోందని, ఈ మూడు నెలల కాలంలో జరిగిన హత్యలపై తాము చర్చ జరగాలని అంటున్నామని జగన్ అన్నారు.
తాము చర్చకు సిద్ధంగానే ఉన్నామని, 2004 నుంచి 2009 వరకు జరిగిన హత్యలపై, ఆ తర్వాత జరిగిన హత్యలపై చర్చించడానికి తాము సిద్దంగా ఉన్నామని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మాటిమాటికీ సభను అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని పాలించినప్పుడు ఎన్ని హత్యలు జరిగాయి, ఆ తర్వాత ఎన్ని హత్యలు జరిగాయి.. అన్నీ చర్చిద్దామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications