చంద్రబాబు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నాడో పురంధేశ్వరికి బొత్తిగా తెలియదట..
Chandrababu Naidu: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమౌతారు.
బీజేపీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు సాగిస్తోన్న విషయం తెలిసిందే. దీనికోసం చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. జనసేన సైతం ఇదే కోరుకుంటోంది. అన్ని పార్టీలతో కలిసి ఉమ్మడిగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనాలని భావిస్తోంది. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా టీడీపీ-జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి సంసిద్ధంగా ఉన్నారు.

ఈ పరిణామాల మధ్య చంద్రబాబు బుధవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. రాత్రి ఢిల్లీకి వెళ్తారు. గురువారం ఉదయం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో వేర్వేరుగా సమావేశమౌతారు. పొత్తు అంశాలపై చర్చిస్తారు. సీట్ల పంపకాల గురించీ మాట్లాడతారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై తాజాగా పురంధేశ్వరి స్పందించారు. ఆయన ఎందుకు ఢిల్లీ వెళ్తున్నాడనేది తనకు తెలియదని అన్నారు. మీడియాలో వచ్చిన తరువాతే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని వ్యాఖ్యానించారు. టీడీపీతో పొత్తుల గురించి ఇప్పటికిప్పుడు ఏమీ మాట్లాడలేనని అన్నారు.
అయోధ్య రామమందిరాన్ని సందర్శించడానికి రైల్వే అధికారులు ప్రవేశపెట్టిన రైలును.. పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్తో కలిసి ఈ ఉదయం గుంటూరులో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పొత్తుల విషయంలో పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని పురంధేశ్వరి చెప్పారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే దాన్ని అధిష్టానమే చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.
వై సత్యకుమార్ మాట్లాడుతూ.. పొత్తుల విషయంలో నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉందని, దీనికోసం పొత్తులు అవసరమౌతాయని పార్టీ అధిష్ఠానం భావిస్తే దానికి కట్టుబడి ఉంటామని అన్నారు.












Click it and Unblock the Notifications