చంద్రబాబు పొత్తు ఆశలపై నీళ్లు: సోము వీర్రాజు కౌంటర్ అటాక్: మీ కుటుంబం కోసం మేం త్యాగం చేయాలా?
అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు మొదలు పెట్టిన పొత్తు ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. దీనికి ఆరంభంలోనే చెక్ పడింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోవాలంటే- వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాల్సి ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ తోసిపుచ్చింది.. తప్పుపట్టింది.
ఏపీ కేబినెట్ సమావేశం షెడ్యూల్ ఫిక్స్: కొత్త మంత్రులతో వైఎస్ జగన్ తొలి భేటీ
కుటుంబ పార్టీలకు దూరం..
చంద్రబాబు పొత్తుల కోసం త్యాగం చేయడానికి తాము సిద్ధంగా లేమని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న పొత్తుల వల్ల ఇప్పటికే చాలా నష్టపోయామని వ్యాఖ్యానించారు. తమ పార్టీ పలు త్యాగాలను చేసిందని స్పష్టం చేశారు. కుటుంబ రాజకీయాల కోసం పాకులాడుతున్న తెలుగుదేశం పార్టీ కోసం తాము త్యాగాలు చేయాలా? అంటూ నిలదీశారు. అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ వంటి పార్టీలతో పొత్తు ప్రసక్తే ఉండబోదని అన్నారు.
కిసాన్ మోర్చా సమావేశంలో కీలక వ్యాఖ్యలు..
విజయవాడలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్ కుమార్ చాహర్, శశిభూషణ్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా కనిపిస్తోందని, అందువల్లే తమతో చంద్రబాబు పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
భారీ బహిరంగ సభలు..
అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తామని, ఇందులో భాగంగా జూన్ మొదటివారంలో విజయవాడ, రాజమండ్రిల్లో బహిరంగ సభలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ సభల నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని సోము వీర్రాజు అన్నారు. కేంద్రంలో అధికారంలో తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు జగన్ సర్కార్ స్టిక్కర్లు అంటిస్తోందని మండిపడ్డారు.
సంక్షేమం అంటే మోడీదే..
ప్రజల సంక్షేమం గురించి మాట్లాడే హక్కు, అధికారం తమ పార్టీకే ఉందని సోము వీర్రాజు చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ క్యాడర్- జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం ఉందని, అవినీతి రహిత పరిపాలనను అందిస్తున్నామని అన్నారు. ప్రధాని మోడీ సారథ్యంలో బీజేపీ- ఏపీలో బలమైన ప్రత్యామ్నాయ పార్టీగా ఆవిర్భవించిందని సోము వీర్రాజు అన్నారు. ఇలాంటప్పుడు తాము మరో పార్టీతో పొత్తు పెట్టుకుని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు.
కుటుంబ పార్టీలకు వ్యతిరేకం..
ఒక కుటుంబ పార్టీ కోసం తాము త్యాగం చేయబోమని, తమ సిద్ధాంతానికి అది భిన్నమని సోము వీర్రాజు చెప్పారు. కుటుంబం పార్టీలు, అవినీతి రాజకీయాలకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు ఏపీలో ప్రతి ఒక్కరి వద్దకు చేర్చడమే తమ లక్ష్యమని అన్నారు. ఏపీలో రైతులను పరిష్కరించడంలో ఇన్ని సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించిన కుటుంబ పార్టీలు ఘోరంగా విఫలం అయ్యాయని సోము విమర్శించారు. గతంలో చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులను దగా చేశాయని ధ్వజమెత్తారు.