జగన్ ను వ్యతిరేకించే వ్యక్తికి బీజేపీ అధ్యక్ష పదవి??
భారతీయ జనతాపార్టీ ఏపీ అధ్యక్ష పదవి త్వరలోనే ముగియనుంది. ప్రస్తుతం సోము వీర్రాజు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సోముకు మందు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా పనిచేశారు. సోము పదవీ కాలం త్వరలోనే ముగియనుండటంతో అధ్యక్ష పదవికి ఎవరు పోటీలో ఉన్నారనే ఆసక్తి అందరిలో వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి ఢిల్లీ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్న నేతలెవరున్నారా అనే ఆరాలో మీడియా సంస్థలున్నాయి.

పోటీపడుతున్న సత్యకుమార్!
భారతీయ జనతాపార్టీ అధ్యక్ష పదవికి రాయలసీమకు చెందిన సీనియర్ నేత సత్యకుమార్ పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవలే ముగిసిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తిచేశారు. ఎలక్షన్ మేనేజ్మెంట్లో నిపుణుడైన సత్యకుమార్ అయితే రానున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని, 2029లో అధికారంలోకి రావాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకోవడంవల్ల అందుకు తగ్గ వ్యక్తి అవుతారని అమిత్ షా, జేపీ నడ్డా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పత్రికలో కాలమిస్టుగా ఉన్నారు!
సత్యకుమార్ మీడియాకు సుపరిచితులు. ఒక దినపత్రికలో ఆయన కాలమిస్టుగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సోము వీర్రాజుతోపాటు కొందరు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారంటూ విమర్శలు వస్తుంటాయి. అయితే సోముతోపాటు ఇతర నేతలు కూడా వీటిని ఖండించారు. అమరాతికి మద్దతుగా రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం అధికార పార్టీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. ఒకవేళ సత్యకుమార్ అధ్యక్షుడిగా ఎంపికైతే వైసీపీతో బీజేపీకి సత్సంబంధాలుండవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

టీడీపీకి అనుకూలంగా ఉంటారంటారు?
సత్యకుమార్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారని, ఆయన అధ్యక్షుడైతే బీజేపీ, టీడీపీ మధ్య మళ్లీ స్నేహం చిగురించినట్లేనని, అతను అధ్యక్షుడు కాకుండా అడ్డుకుంటే వైసీపీ విజయవంతమైనట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బీజేపీ అగ్రనేతలు సత్యకుమార్కు అవకాశం ఇస్తారా? లేదంటే ఎవరూ ఊహించని వ్యక్తిని తెరపైకి తెస్తారా? అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఏదేమైనప్పటికీ సోము వీర్రాజు స్థానంలో నూతన వ్యక్తి ఏపీ కమల దళపతి అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications