పొత్తులపై పురంధేశ్వరి క్లారిటీ - వైసీపీ ప్రభుత్వానికి అల్టిమేటం..!!
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. గజమాలతో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. పార్టీ ముఖ్య నేతల సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు. ఆ వెంటనే వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పలు ఆరోపణలు చేసారు. అటు జనసేనతో మైత్రి పైనా క్లారిటీ ఇచ్చారు. పొత్తుల విషయంతో తన పాత్రను తేల్చేసారు. సోము వీర్రాజుకు మద్దతుగా వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వంపై పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైన పురందేశ్వరికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో ఏపీ బీజేపీ చీఫ్ బీజేపీ పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు. బీజేపీ పార్టీ ఆఫీస్ వద్ద కూడా బాణాసంచాతో సందడి చేసారు. ఏపీలో బీజేపీ అన్ని విధాలా సహకారం అందించిందని చెప్పుకొచ్చారు.

బీజేపీ అందించిన సహకారం ఎలాంటిదో చూడాలన్నారు. కేంద్రం చలవతోనే రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయన్నారు. అధ్యక్షురాలి హోదాలో తొలి మీడియా సమావేశంలోనే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. ఏపీకి ప్రధాని ఆవాస్ యోజన కింద 22 లక్షలకు పైగా ఇళ్లను కేటాయించిందని తెలిపారు. దీంతో మీరు పేదలకు ఇచ్చే సమాధానం ఏంటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పెట్టుబడులు రాష్ట్రానికి రావడం లేదని.. ఉన్నవి తరలిపోతున్నాయని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండేళ్లలోనే జాతీయ విద్యాసంస్ధలన్నీ కేంద్రం ఏపీలో నిర్మించిందన్నారు. ఎయిర్ పోర్టుల విస్తరణను కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఏపీలో అభివృద్ధి జరిగిందన్నారు.
విజయవాడ ఎయిర్పోర్టు విస్తరణ, పలు ఎయిర్పోర్టుల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్ధాపనకు ప్రభుత్వం కృషి చేయలేదని విమర్శించారు. తెలిపారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ప్రతీ రైతుకు రూ.12 వేలు ఇస్తామన్నారని.. దానిపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇస్తున్న రూ.6 వేలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రైతులను సీఎం మోసం చేయడం కాదా అంటూ మండిపడ్డారు.
పోలవరం పై కేంద్రం ఎక్కడా జాప్యం చేయలేదని స్పష్టం చేశారు. ఇటీవల రూ.12 వేల కోట్లు పోలవరంకి కేంద్రం ఇచ్చిందన్నారు. పోలవరం మీరు కట్టకుంటే కేంద్రానికి అప్పచెప్పాలన్నారు. పోలవరం విషయంలో కేంద్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదని చెప్పుకొచ్చారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పటిదాకా బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్ధితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. పాత్తుల అంశాన్ని పార్టీ నాయకత్వం చూసుకుంటుందని చెప్పారు. పవన్తో సోమువీర్రాజు మాట్లాడుతునే ఉండేవారన్నారు. జనసేన తమకు ఎప్పటికీ మిత్ర పక్షమే అని పురంధేశ్వరి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications