ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్కు గవర్నర్ విశ్వభూషణ్ ఆమోద ముద్ర...
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఆర్డినెన్స్కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. 3 నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు గవర్నర్ ఆమోదం లభించడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాబోయే 3 నెలల కాలానికి ప్రభుత్వ వ్యయం కోసం రూ.90 వేల కోట్ల బడ్జెట్తో ఈ ఆర్డినెన్స్ తెచ్చారు. ఉద్యోగుల జీతభత్యాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఈ నిధుల కేటాయిస్తారు. రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 31తో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ప్రస్తుత వ్యయ నిర్వహణ కోసం ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది.
తాజా ఆర్డినెన్స్కు శుక్రవారం ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు ఆమోదం లభించింది. తాజా ఆర్డినెన్స్తో ఏప్రిల్లోనూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. వాస్తవానికి మార్చిలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి.. బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంది. కానీ వరుస ఎన్నికలు, కరోనా కేసుల పెరుగుదల, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ జారీ అవడంతో.. అసెంబ్లీ సమావేశాలు సాధ్యం కాదని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది.

గతేడాది కూడా కరోనా వైరస్ కారణంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండా ప్రభుత్వం బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది దుష్ట సంప్రాదాయమని టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోద ముద్ర వేయరాదని ఆయన కోరారు. ఎన్నికల సాకుతో బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయడం పలాయనవాదమేనని మండిపడ్డారు. వార్షిక బడ్జెట్ను కూడా ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చే దుష్ట సంప్రాదాయానికి జగన్ శ్రీకారం చుట్టారని దుయ్యబట్టారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి సాకులతో బడ్జెట్ సమావేశాలు వాయిదా వేయలేదన్నారు.












Click it and Unblock the Notifications