ఏపీలో వరుస ప్రమాదాల ఎఫెక్ట్- బస్సులో ఆ మహిళ చేసిన పనికి ఎమ్మెల్యే షాక్..!
ఏపీలో ఈ మధ్య వరుసగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్య కర్నూల్లో జరిగిన బస్సు ప్రమాదంలో అయితే ఏకంగా 19 మంది సజీవ దహనం అయిపోయారు. ఆ తర్వాత కూడా ప్రైవేటు బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఈ ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని చింతలపూడి నియోజకవర్గంలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాలతో జనం బెంబేలెత్తుతున్నారు. దీంతో వారిలో తిరిగి బస్సు ప్రయాణాలపై విశ్వాసం కల్పించేందుకు ఓవైపు రవాణాశాఖ అధికారులు వరుస తనిఖీలు నిర్వహిస్తుంటే.. ప్రజా ప్రతినిధులు సైతం ఇలా తనిఖీల్లో పాలుపంచుకుంటున్నారు. ఇదే క్రమంలో చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కూడా తన నియోజకవర్గ పరిధిలో ఓ బస్సు ఎక్కారు. అందులో ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. అదే సమయంలో ఓ మహిళ ఆయనకు ఇనుప రాడ్డుతో కనిపించింది. దీంతో ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ షాకయ్యారు.

ఇటీవల ప్రైవేట్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో చింతలపూడిలో ఎమ్మెల్యే ప్రైవేట్ ట్రావెల్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఓ మహిళ బ్యాగులో రాడ్ గుర్తించారు. ప్రమాదం జరిగితే అద్దాలు పగలగొట్టేందుకు రాడ్ తెచ్చుకున్నానని మహిళ చెప్పడంతో ఎమ్మెల్యే రోషన్ ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో ఆయనకు ఏం చెప్పాలో తెలియలేదు. మహిళలు అత్యవసర సమయంలో ప్రమాదాల నుంచి బయటపడేందుకు ఇలా రాడ్డుల్ని సైతం తీసుకెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రభుత్వ బాధ్యత మరింత పెరిగిందనే చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications