కొనసాగే మంత్రులు వీరే -15 మంది కొత్తవారితో : బుజ్జగింపులు ఉండవ్ - జగన్ కేబినెట్ కూర్పు ఇలా..!!
సీఎం జగన్ తన మార్క్ కేబినెట్ సిద్దమైంది. కూర్పులో పక్కా సీనియార్టీ - సామాజిక - ప్రాంతీయ సమీకరణాలే ప్రామాణికంగా తీసుకున్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. గతం కంటే బీసీ-ఎస్సీలకు మంత్రి పదవులు పెరగనున్నాయి. సీనియర్లు - కొత్త వారి కలయిక తో కేబినెట్ జాబితా సిద్దం అయింది. తాజా మాజీ మంత్రుల్లో 10 మంది కొనసాగింపు ఖాయమైంది. కొత్తగా 15 మంది కేబినెట్ లో చేరనున్నారు. ఇప్పటికే 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించాలని సిఫార్సు చేస్తూ గవర్నర్ వద్దకు పంపారు. ఈ మధ్నాహ్నం అధికారికంగా 25 మంది మంత్రుల జాబితాను గవర్నర్ కు పంపనున్నారు.

కంటిన్యూ కానున్న మంత్రులు వీరే..
రేపు ఉదయం 11.31 గంటలకు కేబినెట్ కొలువు తీరనుంది. ఇప్పటిదాకా రాష్ట్ర కేబినెట్లో అగ్రవర్ణాలకు చెందిన వారు 44 శాతం ఉండగా... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే మెజారిటీ సంఖ్యలో 56 శాతంగా ఉన్నారు. తాజా కేబినెట్ కూర్పులో బీసీ -ఎస్సీ వర్గాలకు మరింత ప్రాధాన్యత పెరగనుంది. అందులో భాగంగా.. రెడ్డి - కాపు వర్గాలకు ఒక్కో సీటు తగ్గించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మహిళల సంఖ్య మూడు నుంచి నాలుగుకు పెరగనుంది. కొనసాగే మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..బొత్సా సత్యనారాయణ.. కొడాలి నాని.. బుగ్గన రాజేంద్రనాధ్ .. సిదిరి అప్పలరాజు.. చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ..అదిమూలపు సురేష్.. అంజాద్ బాషా.. జయరాం ..తానేటి వనిత పేర్లు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం.

బీసీ - ఎస్సీ వర్గాలకు పెరిగిన ప్రాధాన్యత
అయితే, కొత్తగా కేబినెట్ లో చేరే 15 మంది జాబితాలో ధర్మాన ప్రసాద రావు.. గుడివాడ అమర్నాధ్.. దాడిశెట్టి రాజా.. దొరబాబు..గ్రంధి శ్రీనివాస్..కాకాని గోవర్ధన్ రెడ్డి..పార్ధసారధి..పేర్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా భాగ్యలక్ష్మి..జోగి రమేష్..విడదల రజనీ..జొన్నలగడ్డ పద్మావతి.. జంగాలపల్లి శ్రీనివాసులు...ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు..మేరుగ నాగార్జున..సంజీవయ్య పేర్లు పైన కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఇదే సమయంలో మంత్రి పదవులు చేసి..తిరిగి పదవులు దక్కని వారికి జిల్లా డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మన్ గా నామినేటెడ్ హోదాలో పదవులు కట్టబెట్టేందుకు రంగం సిద్దం అవుతోంది. కేబినెట్ విస్తరణ తరువాత దీని పైన అధికారికంగా నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది.

బుజ్జగింపులకు నో ఛాన్స్.. ఆ పదవులతో..
చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి పేరు ఖరారు కావటంతో.. అదే వర్గానికి చెందిన చెవిరెడ్డిని నామినేటెడ్ పదవి రెన్యువల్ చేసారు. రోజా.. కరుణాకర రెడ్డికి ఇక చాన్స్ లేనట్లుగానే కనిపిస్తోంది. అయితే, మంత్రి పదవులు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన వారిని బుజ్జగించే అవకాశాలు లేవని పార్టీ అధినాయకత్వం తేల్చి చెబుతోంది. ఎవరి సేవలు ఎలా వినియోగించుకోవాలో సీఎం కు బాగా తెలుసని..అదే విధంగా నిర్ణయాలు జరుగుతాయని పదవులు దక్కని వారికి స్పష్టం చేస్తున్నారు. దీంతో..కొనసాగే మంత్రుల పైన స్పష్టత రావటంతో..కొత్తగా చేరే 15 మంది పైన అధికారిక జాబితా ఈ మధ్నాహ్నం వెల్లడి కానుంది. దీంతో..ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications