ఆ మహిళలకు బాబు బంపర్ ఆఫర్, విభజనపై..
హైదరాబాద్: విభజనలో జరిగిన అన్యాయాల పైన వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించాలని, 3-7 వరకు ఏడాది పనుల పైన సమీక్ష నిర్వహించాలని, 8న బహిరంగ సభ ఏర్పాటు చేయాలని, జూన్ తొలి వారంలో డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.4,284 కోట్లు వేయాలని, కూరగాయల విత్తనాలపై 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని, టీటీడీ ధర్మకర్తల మండలి నుండి తుడా చైర్మన్ను తొలగించాలని.. ఇలా ఏపీ కేబినెట్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
డ్వాక్రా సంఘాల్లో ప్రతి మహిళా సభ్యురాలికి రూ.10 వేల చొప్పున రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. డ్వాక్రా రుణాలపై వడ్డీతోపాటు తక్షణమే 30 శాతాన్ని చెల్లించాలని తీర్మానించింది. మిగిలిన రుణాలను రెండు సమాన వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు మహిళా సంఘాల రుణ మాఫీకి ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించింది. డ్వాక్రాలో 88 లక్షల మంది సభ్యులు ఉన్నారని, ఒక్కో సభ్యురాలికి రూ.10 వేల చొప్పున అందజేస్తే రూ.9000 కోట్లు అవుతుందని కేబినెట్ నిర్ధారణకు వచ్చింది.
డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలకు ఇప్పటి వరకు రూ.1284 కోట్లమేర వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని లెక్కించింది. ఈ నేపథ్యంలో, ఒక్కో సభ్యురాలికి ఇవ్వాలనుకున్న రూ.10 వేలల్లో తక్షణమే 30 శాతం చెల్లించాలని, దాంతోపాటు మొత్తం వడ్డీని కూడా తక్షణమే చెల్లించాలని, ఈ మేరకు రూ.3000 కోట్లతోపాటు వడ్డీ రూ.1284 కోట్లను కలిపి రూ.4284 కోట్లను తక్షణమే బ్యాంకులకు చెల్లించాలని తీర్మానించింది.
ఈ ప్రక్రియను జూన్ మూడో తేదీ నుంచి ఏడో తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. మిగిలిన 70 శాతాన్ని రెండు ఆర్థిక సంవత్సరాల్లో 35 శాతం చొప్పున వడ్డీతో సహా చెల్లించాలని నిర్ణయించింది.
ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జూన్ ఎనిమిదో తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. రాజధాని నగర సమీపంలోనే నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన జూన్ రెండో తేదీని నవ నిర్మాణ దీక్ష రోజుగా నిర్వహించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది.
బొగ్గు గనుల్లో వచ్చే లాభాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఇవ్వాలంటూ ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ స్వాగతించింది. అదే సమయంలో, రాష్ట్రంలో కృష్ణా-గోదావరి బేసిన్లో లభించే సహజవాయు, పెట్రోలియం ఉత్పత్తుల లాభాల్లోనూ ఆంధ్రప్రదేశ్కు వాటా ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది.
విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు ఏవియేషన్ అకాడమీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కాగా, మంత్రివర్గ సమావేశం ఏకబిగిన పది గంటలపాటు కొనసాగింది. ఉదయం పది గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి ఎనిమిది గంటలకు ముగిసింది.