కేబినెట్ భేటీ: మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దం అవుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ప్రత్యేక మంత్రివర్గ సమావేశానికి చంద్రబాబు నిర్ణయించారు. కీలక అంశాల పై నిర్ణయంతో సహా పలు రాటిఫికేషన్లను ఆమోదం తెలపనున్నారు. అదే విధంగా వాలంటీర్లు, 108 ఉద్యోగుల అంశం, పథకాల అమలు పైన నిర్ణయం తీసుకోనున్నారు. సోషల్ మీడియాలో అసభ్య సందేశాల నిరోధానికి ప్రత్యేకంగా తీసుకొచ్చే చట్టానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.
కొత్త చట్టానికి ఆమోదం
ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ప్రత్యేకంగా ఈ భేటీకి నిర్ణయించారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ కొనసాగనుంది. సభలో ఆమోదించాల్సిన బిల్లుల పైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల నిరోధానికి వీలుగా ప్రత్యేక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందు కోసం కొత్త చట్టం తీసుకురావటం తో పాటుగా ప్రత్యేక స్టేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మహిళలను కించ పరిచేలా ఎవరైనా పోస్టులు పెడితే కఠిన చర్యలకు వీలుగా ఈ చట్టం తీసుకురానున్నారు.

ఇలా ముందుకెళ్దాం
ఇక, పెండింగ్ లో ఉన్న పలు అంశాల పైన మంత్రివర్గం చర్చించనుంది. వాలంటీర్ల కొనసాగింపు అంశం పైన సస్పెన్స్ కొనసాగుతోంది. అయిదు నెలలుగా వారికి విధులు కేటాయించ లేదు. వేతనాలు ఇవ్వలేదు. బడ్జెట్ లోనూ ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఇప్పటికే వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. వాలంటీర్లకు స్కిల్ శిక్షణ ఇచ్చి అవసరం మేర వారి సర్వీసులను గ్రామ, పట్టణ ప్రాంతాల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా సూపర్ సిక్స్ హామీల పై వైసీపీ విమర్శలు చేస్తున్న సమయం లో ప్రభుత్వం వీటి అమలుకు వీలుగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
పథకాల అమలు
ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తోంది. బడ్జెట్ లో రైతులకు రూ 20 వేలు, అమ్మకు వందనం కు నిధులు కేటాయించింది. అయితే, పూర్తి స్థాయిలో అమలుకు వీలుగా ఆ కేటాయింపులు లేవని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో, జనవరిలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో రూ 20 వేల జమ పైన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సంక్రాంతి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు దిశగా కార్యాచరణ సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఈ మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు పథకాల అమలుతో పాటుగా అమ్మకు వందనం అమలు ముహూర్తం పైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications