ఏపీ కేబినెట్ నిర్ణయాలు- 175 ఎంఎస్ఎంఈ పార్కులు, 17 ఖైదీలకు క్షమాభిక్ష..!
ఇవాళ అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఏడాది పాలనలో 25 పేపర్ లెస్ కేబినెట్ భేటీలు నిర్వహించిన చంద్రబాబుకు మంత్రులు అభినందనలు తెలిపారు. శ్రీకాకుళంలోని ఉద్దానం, చిత్తూరు జిల్లా కుప్పంలోని పలు ప్రాంతాలకు ఆర్వో ప్లాంట్లకు నిధుల కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఏదైనా నేరం చేస్తే క్షమాభిక్ష రద్దవుతుంది.
ఎస్పీఎఫ్ లో 248 కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ ఇవ్వడంతో పాటు ఆ మేరకు కానిస్టేబుళ్ల సంఖ్యను తగ్గించడానికి కేబినెట్ అంగీకారం తెలిపింది. వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడపగా మార్చేందుకు ఇచ్చిన నోటిఫికేషన్ కు ఆమోదం తెలిపింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో పోలీసు అకాడమీకి భూమి ఉచితంగా బదిలీకి ఆమోదం తెలిపారు. ఏలూరులో నిర్మించే హైదరాబాద్ ఐ ఇన్ స్టిట్యూట్ కు మాజీ ఐఏఎస్ దమయంతి ఉచితంగా ఇచ్చిన భూమిని బదలాయించేందుకు కూడా ఆమోదం తెలిపారు. దీనికి స్టాంప్ డ్యూటీ మినహాయిస్తారు. ఏపీ సీఆర్డీఏ తాజా భేటీలో తీసుకున్న నిర్ణయాల్ని ఆమోదించారు.

ఏపీ పరిశ్రమల బిల్లు ద్వారా కార్మిక రంగ సంస్కరణలు, పారిశ్రామిక సంస్థలపై భారం తగ్గించడానికి ఆమోదం తెలిపారు.ఈ సవరణవల్ల మహిళలు రాత్రిపూట కూడా పనిచేసేందుకు భద్రత, రవాణా తదితర సౌకర్యాలు కల్పించేందుకు వీలు కలుగుతుంది. విశాఖలో హరిత హోటల్ యాత్రీ నివాస్ ఆధునీకీకరణ పనులకు అనుమతుల ధృవీకరణకు కేబినెట్ అంగీకారం తెలిపింది. అమరావతిలో ఏపీ క్వాంటం మిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ డే కోసం పిలిచిన టెండర్లకు ఆమోదం తెలిపారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications