మాజీ మంత్రి నారాయణ, కుటుంబానికి సీఐడీ నోటీసులు-అమరావతి కేసులో మార్చి 6న విచారణ
ఏపీలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో మాజీ మంత్రి నారాయణతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సీఐడీ నోటీసులు పంపింది.
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం సందర్భంగా తయారు చేసిన అలైన్ మెంట్లో మార్పులు చేసి లబ్ది పొందారన్న ఆరోపణల్ని మాజీ మంత్రి నారాయణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా కోర్టు అనుమతితో విచారణకు రావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో నారాయణకు గతంలో పలుమార్లు విచారించిన సీఐడీ.. ఈసారి ఆయనతో పాటు భార్య రమాదేవిని కూడా ఈ కేసులో విచారణకు రావాలని సెక్షన్ 41ఎ నోటీసులు పంపింది. వీరిద్దరితో పాటు రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ కు, నారాయణ సంస్ధల ఉద్యోగి ప్రమీలకు కూడా సీఐడీ నోటీసులు పంపింది. వీరందరినీ మార్చి 6వ తేదీన గుంటూరులో విచారణకు రావాలని కోరింది.

మరోవైపు ఈ కేసులో సాక్ష్యులుగా విచారణకు హాజరు కావాలని మరో నలుగురికి సీఐడీ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు పంపింది. సాక్ష్యులుగా విచారణకు రావాలని కోరిన వారిలో మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు సింధూర, షరిణితో పాటు అల్లుడు పునీత్, నారాయణ సంస్ధల ఉద్యోగి వరుణ్ కుమార్ ఉన్నారు. వీరందరినీ మార్చి 7, 8 తేదీల్లో విచారణకు హాజరు కావాలని సీఐడీ కోరింది. దీంతో ఈ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications