ఎపి సిఎం దక్షిణ కొరియా పర్యటన....డిసెంబర్ 3 న బయలుదేరి వెళ్లనున్న చంద్రబాబు
అమరావతి: అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దక్షిణకొరియాలో పర్యటించనున్నారు. మూడురోజుల పాటు సాగే ఈ పర్యటన నిమిత్తం డిసెంబర్ 3 న చంద్రబాబు ఇక్కడి నుంచి బయలుదేరివెళతారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆహ్వానమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగనుంది.
3వ తేదీ నుంచి ఆరో తేదీ వరకూ ఆయన ఆ దేశంలోని సియోల్, బుసాన్ నగరాల్లో పర్యటిస్తారు. కొద్ది రోజుల క్రితం కొరియా నుంచి పారిశ్రామికవేత్తల బృందం ఇక్కడకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఎకరాల భూమి ఇస్తే పలు కొరియా కంపెనీలతో పారిశ్రామిక వాడ నెలకొల్పుతామని వారు ఆ సందర్భంలో ప్రతిపాదించారు.
తమ దక్షిణ కొరియా కంపెని కియా కార్ల ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతున్న అనంతపురం జిల్లా పెనుకొండ లేదా కృష్ణపట్నం పోర్టు సమీపంలోనే తాము అడిగిన భూమి ఇవ్వగలిగితే బాగుంటుందని దక్షిణ కొరియా ప్రతినిధుల బృందం కోరింది.
దక్షిణ కొరియా రెండవ అతిపెద్ద ఆటో మొబైల్ కంపెనీ అయిన కియా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారం పట్ల ఆకర్షితులైన మిగతా కొరియా పారిశ్రామికవేత్తలు తాము కూడా త్వరితంగానే ఫ్యాక్టరీలు నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు సిఎంకు తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాజెక్ట్ లపై మరోసారి చర్చించి తుది రూపు ఇచ్చే నిమిత్తం ముఖ్యమంత్రి దక్షిణ కొరియా పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో బుసాన్లో ఉన్న కియా కార్ల ఫ్యాక్టరీని కూడా చంద్రబాబు సందర్శిస్తారు.