ఉద్యోగులకు చంద్రబాబు దీపావళి కానుక ఇదే..! డీఏ సహా ఇవే-పీఆర్సీపై క్లారిటీ..!
ఏపీలో పెండింగ్ లో ఉన్న ఆర్ధిక ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ఇవాళ గుడ్ న్యూస్ చెప్పారు. నిన్నటి నుంచి సుదీర్గంగా జరుగుతున్న చర్చల తర్వాత చంద్రబాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందుల్ని వివరించారు. అనంతరం ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వెల్లడించారు.
ఉద్యోగులకు ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్న డీఏల్లో ఒకటి ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మొత్తాన్ని నవంబర్ 1న ఇచ్చే జీతంలో కలిపి ఇస్తామని వెల్లడించారు. ఇందుకోసం దాదాపుగా 160 కోట్లు ఖర్చవుతందని అంచనా వేసినట్లు చంద్రబాబు తెలిపారు. తొలిదశలో ఈ డీఏ చెల్లింపు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎర్నెడ్ లీవులు పోలీసులకు మాత్రం క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు. అది కూడా ప్రస్తుతం 50 శాతం చెల్లించి మరో 50 శాతం జనవరిలో చెల్లిస్తామని తెలిపారు.

మరో 60 రోజుల్లో ఏ ఉద్యోగికీ ఇబ్బంది లేకుండా వ్యవస్ధల్లో మార్పులు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. చైల్డ్ కేర్ లీవ్ రిటైర్మెంట్ వరకూ 180 రోజుల పాటు వాడుకునేేలా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆఫీసులకు ఆస్తిపన్ను మినహాయింపు గతంలో ఉండేదని, ఇప్పుడు మళ్లీ పన్నుల బాధ లేకుండా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు క్లియర్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీపావళి సందర్భంగా సోమవారం దీనిపై ఉత్తర్వులు ఇస్తామన్నారు. రాష్ట్రం ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, ఒకసారి సంపద సృష్టి జరిగితే దాని ప్రయోజనాన్ని తిరిగి ఉద్యోగులకు బదిలీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

అసిస్టెంట్, అటెండర్ పదవుల పేర్లను గౌరవ ప్రదంగా మార్చాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. కీలకమైనన పీఆర్సీపై మాత్రం కొంత టైం పడుతుందని ఉద్యోగులకు చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. తనకు వెసులుబాటు రాగానే దీనిపై నిర్ణయం ఉంటుందన్నారు. 2004 కంటే ముందు నియమించిన ఉద్యోగులకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సీపీఎస్ వర్తింపు చేయాల్సి ఉందన్నారు. దీనిపై మంత్రుల కమిటీ చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications