వైసీపీ హయాంలో తిరుమలలో మహాపాపం - సీఎం చంద్రబాబు ఫైర్
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మీడియాతో మాట్లాడిన ఆయన, తిరుమల ఒక పవిత్రమైన క్షేత్రం అని, అక్కడ జరిగిన అపచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని గట్టి హెచ్చరికలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు.
తిరుమలలో జరిగినది చిన్న తప్పు కాదని, అది మహాపాపం, శ్రీవారిపై చేసిన అపచారం అని చంద్రబాబు స్పష్టం చేశారు. వేంకటేశ్వరస్వామి తనకు అత్యంత నమ్మకమైన దేవుడని, తాను ఆయన దగ్గర ఒక సామాన్య భక్తుడినే అని అన్నారు. ఎప్పుడూ వైకుంఠ ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకోలేదని, ఆ స్థాయి అహంకారం తనకు లేదని చెప్పారు. శ్రీవారి పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టంగా పేర్కొన్నారు.

ప్రక్షాళనలో భాగంగానే చర్యలు..
తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి ఘటనపై తాము ఆచితూచి స్పందించామని చంద్రబాబు వివరించారు. ప్రక్షాళనలో భాగంగానే శ్యామలరావును పంపామని, ఆయన అప్పుడే ఎన్డీడీబీ (NDDB) నివేదికను కోరారని చెప్పారు. ఆ నివేదిక వచ్చిన తర్వాతే తాను మాట్లాడానని, నెయ్యిలో జంతు కొవ్వులు కలిసినట్లు, కల్తీ జరిగినట్లు స్పష్టంగా పేర్కొన్నానని తెలిపారు. ఇక చట్టమే అత్యున్నతమని, రాష్ట్రంలో నెలకొల్పిన శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. చట్టాన్ని, నియమాలను ఉల్లంఘించడానికి ఎవరినీ అనుమతించబోమని గట్టి హెచ్చరిక చేశారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని తేల్చిచెప్పారు.
నిజాలు చెప్పినందుకే దాడులు..
తాను వాస్తవాలు మాట్లాడిన వెంటనే కొందరు రాజకీయంగా నానా యాగీ చేశారని సీఎం విమర్శించారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు వరకూ తీసుకెళ్లారని, అయినా నిజం దాగిపోలేదన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు కోసం సిట్ (SIT) ఏర్పాటు చేశామని తెలిపారు. చివరికి తానే క్షమాపణ చెప్పాలన్న స్థాయికి పరిస్థితులు తీసుకెళ్లే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. "వాళ్లను ఏమనాలి?" అంటూ వైసీపీ నేతల వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అంశంపై ఇప్పుడే మాట్లాడనని చంద్రబాబు స్పష్టం చేశారు. సంబంధిత విషయాలపై సమయం వచ్చినప్పుడు స్పష్టత ఇస్తామని తెలిపారు.
అరాచకమే వారి పాలనకు నమూనా..
వైసీపీ రాజకీయాలు పూర్తిగా నేరమయంగా మారిపోయాయని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. వారి పాలనకు అరాచకమే నమూనాగా నిలిచిందన్నారు. 2024లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను తిరిగి నెలకొల్పామని చెప్పారు. నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి అయితే, ప్రజాసేవ, ప్రజా సాధికారతే తమ ప్రభుత్వ సంస్కృతి అని తేల్చిచెప్పారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిన ప్రతీ అంశాన్ని ఇప్పుడు తమ ప్రభుత్వం తిరిగి నిర్మిస్తుండటాన్ని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని చంద్రబాబు అన్నారు. వారి తప్పులు రోజురోజుకు బయటపడుతున్నాయని, అదే నిరాశ, నిస్పృహలకు కారణమై ప్రతిపక్షంలో ఉన్నా కూడా దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications