చంద్రబాబు ప్రత్యేక చొరవ ఫలితం.. రాష్ట్రానికి మరో మణిహారం.. రేపు అపోలో టైర్స్ భూమిపూజ
చిత్తూరు: రాష్ట్రానికి మరో మణిహారమైన అపోలో టైర్ల పరిశ్రమ తయారీ యూనిట్ ఏర్పాటుకు అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. భూ కేటాయింపు నుంచి పరిశ్రమ నిర్మాణానికి ఏర్పాట్లు చేసేవరకు ఎన్నో అవాంతరాలను, అడ్డంకులను ఈ పరిశ్రమ అధిగమించింది.
ఒక దశలో ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లబోయిన ఈ పరిశ్రమను జిల్లాలోనే నెలకొల్పేలా అపోలో టైర్స్ యాజమాన్యాన్ని ఒప్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవ ప్రశంసనీయం. వారు కోరిన గొంతెమ్మ కోర్కెలన్నీ తీర్చడంలో సీఎం సఫలీకృతులయ్యారు.
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో ఏర్పాటవుతున్న భారీ ప్రాజెక్టుల్లో అపోలో టైర్స్ తయారీ యూనిట్ ఒకటిగా ప్రభుత్వం మొదటి నుంచీ చెబుతోంది. అందుకే ముఖ్యమంత్రి చొరవ తీసుకుని కొన్ని డిమాండ్లను నెరవేర్చి.. ఎట్టకేలకు సంస్థ యాజమాన్యాన్ని ఒప్పించారు.
ఎట్టకేలకు అపోలో టైర్స్కు భూమిపూజ...
జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి తలమానికంగా నిలిచిన సత్యవేడు శ్రీసిటీకి సమీపంలో మరో భారీ పరిశ్రమకు పునాదిరాయి పడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అపోలో టైర్ల పరిశ్రమ తన తయారీ యూనిట్ను జిల్లాలోని చిన్నపాండూరు వద్ద నెలకొల్పేందుకు సిద్ధమైంది. ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ భారీ పరిశ్రమ జిల్లాకు రావడం వెనుక ఎన్నో పరిణామాలున్నాయి. అనేక అవాంతరాలను అధిగమించి.. ఎట్టకేలకు సంస్థ స్థాపనకు ముహూర్తం ఖరారైంది.
భూ సేకరణ నుంచే అడ్డంకులు...
నిజానికి అపోలో టైర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు భూ సేకరణ నుంచే ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. చిన్నపాండూరు రెవెన్యూ వీకేఆర్వై కాలనీలో కొత్తగా సెజ్ను ఏర్పాటు చేశారు. 376 ఎకరాలకు భూసేకరణకు యత్నించగా.. పట్టాల పంపిణీలో వివాదాలు తలెత్తాయి. దీంతో తొలివిడతగా 200 ఎకరాలకు భూసేకరణ చేపట్టి.. ఎకరానికి రూ.6.50 లక్షల చొప్పున పరిహారం అందించారు. ఆ భూములను అపోలో టైర్ల పరిశ్రమకు కేటాయించారు. పరిశ్రమకు రహదారి సౌకర్యాన్ని కల్పించడానికి సత్యవేడు-కడూరు మార్గంలో రూ.6 కోట్ల వ్యయంతో రోడ్డును సైతం వేశారు.
చివరి క్షణంలో భూమిపూజ వాయిదా...
రూ.1200 కోట్ల పెట్టుబడి వ్యయంతో 600మందికి ప్రత్యక్షంగా, మరో 600 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో అపోలో టైర్ల తయారీ పరిశ్రమకు ప్రభుత్వం అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చింది. ఈ పరిశ్రమ నిర్మాణానికి 260 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఆ సంస్థకు కేటాయించింది. గతేడాది సెప్టెంబరు 28నే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ పరిశ్రమ నిర్మాణ పనులకు భూమిపూజ జరగాల్సి ఉంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినా.. చివరి క్షణంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది.
హీరో మోటార్స్ విషయంలోనూ...
అపోలో టైర్ల పరిశ్రమకు సమీపంలోనే హీరో మోటార్స్కు కేటాయించిన 600 ఎకరాలలో సైతం ఇలాగే అడ్డంకులు ఎదురయ్యాయి. స్థానికుల నుంచి అడుగుడుగునా అవాంతరాలు ఏర్పడుతుండడంతో.. ఆందోళన చెందిన హీరో మోటార్స్ యాజమాన్యం కూడా ఓ దశలో పరిశ్రమ ఏర్పాటుకు వెనక్కి తగ్గింది. అప్పడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి.. హీరో మోటార్స్ ఏర్పాటు చేయనున్న పరిశ్రమకు వచ్చే నష్టపరిహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీతోపాటు పూచీకత్తు కూడా ఇవ్వడంతో హీరో మోటార్స్ యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఇలా సీఎం చంద్రబాబు చొరవతో అటు హీరో మోటార్స్ పరిశ్రమ మాత్రమే కాక ఇప్పుడు అపోలో టైర్స్ పరిశ్రమ కూడా రాష్ట్రంలో ఏర్పాటవుతోంది.
దోబూచులాడిన అపోలో...
అపోలో టైర్ల కంపెనీ రాష్ట్రంలో తమ టైర్ల తయారీ యూనిట్ ఏర్పాటుపై చివరి వరకూ సందిగ్ధంలోనే ఊగిసలాడింది. ఓ దశలో షరతులు, ఆంక్షలతో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపించింది. అయితే ప్రభుత్వం అన్నింటినీ అంగీకరిస్తూ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ఈ పరిశ్రమకు కేటాయించిన భూముల్లో నాలుగేళ్లలో పరిశ్రమ నిర్మాణం పూర్తిచేయాలని, లేనిపక్షంలో ఆ భూములను ఏపీఐఐసీ వెనక్కి తీసుకుంటుందని తొలుత నిబంధన విధించారు. అయితే తాము వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతుండగా, సకాలంలో పూర్తిచేయని పక్షంలో భూములు వెనక్కి తీసుకుంటే.. పెట్టుబడి వృథాగా పోతుందని అపోలో యాజమాన్యం వెనకడుగు వేసింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకొని ఆ కాలపరిమితిపై ఆంక్షలు ఎత్తివేయించారు.
మరో 60 ఏకరాలు.. వడ్డీ మాఫీ...
తొలిదశలో రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టిన తర్వాత, దశల వారీగా రూ.4500 కోట్లతో పరిశ్రమను విస్తరించనున్నట్లు అపోలో టైర్స్ యాజమాన్యం నిర్ణయించింది. ఇందుకు మరో 60 ఎకరాలను కేటాయించాలని షరతు విధించింది. ప్రభుత్వం మెట్టు దిగి.. ఆ మేరకు స్థలాన్ని ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే, భూములు కేటాయించిన 90 రోజుల్లోపు సంస్థ నిర్ణయించిన భూమి ధరను ఏపీఐఐసీకి చెల్లించాలి. నిబంధనల మేరకు చెల్లించని పక్షంలో 91 రోజుల తర్వాత 16 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఇలా ఎకరాకు రూ.11 లక్షల చొప్పున కేటాయించగా, వివిధ కారణాలతో మొన్నటివరకు అపోలో యాజమాన్యం డబ్బులు చెల్లించలేదు. నిబంధనల ప్రకారం ఇప్పటివరకు రూ.79.28 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ వడ్డీని చెల్లించేందుకు అపోలో ససేమిరా అనగా.. ప్రభుత్వం అంగీకరించి మాఫీ చేసింది.
అన్ని సమస్యలూ పరిష్కరించిన సీఎం...
రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేసినా కూడా.. భవిష్యత్లో పరిశ్రమకు కేటాయించిన ఈ భూములపై పరిహారం కోసం బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఎలా? ఈ సందేహంతో మళ్లీ అపోలో టైర్స్ యాజమాన్యం పరిశ్రమ ఏర్పాటుకు వెనకడుగు వేయగా.. ఆ పరిహారాన్ని కూడా తామే భరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొంది. సత్యవేడు ప్రాంతంలో నీటివసతి లేని కారణంగా ఓ దశలో ఈ కంపెనీ తమిళనాడు వైపు వెళ్లేందుకు మొగ్గు చూపగా... అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి.. సమీపంలోని తెలుగుగంగ ఉపకాలువ ద్వారా నీటివసతి కల్పిస్తామని యాజమాన్యానికి హామీ ఇచ్చారు. మొత్తంమీద అపోలో టైర్స్ యాజమాన్యం అడుగడుగునా సందేహాలు లేవనెత్తినా, ఆంక్షలు విధించినా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిసారీ చొరవ తీసుకుని రాష్ట్రంలోనే అపోలో టైర్ల తయారీ పరిశ్రమ స్థాపనకు మార్గం సుగమం చేశారు.