ఏపీలో రెడ్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం చేయండి.. మోడీని కోరిన జగన్
ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్దితుల్లో లాక్ డౌన్ పొడిగింపుకు ప్రభుత్వం మొగ్గుచూపడం లేదనే అంచనాలే నిజమయ్యాయి. ఇప్పటికే ప్రధానితో ఓసారి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రెడ్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం చేయాలని కోరగా... ఇవాళ సీఎం జగన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై మంత్రివర్గ కమిటీ సిఫార్సులు తీసుకున్నాక ప్రధాని తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మోడీ-జగన్ వీడియో కాన్ఫరెన్స్
ఏపీలో నెలకొన్న కరోనా వైరస్ పరిస్దితులపై ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన అభిప్రాయాలను ప్రధాని మోడీతో సీఎం జగన్ పంచుకున్నారు. ఇందులో ప్రధానంగా సీఎం వ్యక్తం చేసిన అభిప్రాయాలను బట్టి చూస్తే... కోవిడ్ని-19 నివారణకు ప్రధాన మంత్రిగా మోడీ తీసుకున్న విశాలపరమైన, గట్టి చర్యలను జగన్ బలంగా సమర్థించారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ చక్రం ముందుకు కదలాలన్న అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ చక్రం పూర్తి వేగంతో ముందుకు కదలకపోయినా, కనీసం ప్రజల అవసరాలకు తగినట్టుగా నైనా నడవాలని జగన్ ప్రధాని దృష్టికి తెచ్చారు.
గతాన్ని గుర్తు చేసిన జగన్..
1918లో వచ్చిన ఫ్లూ కూడా భారతదేశ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసిందని, రెండేళ్లకుపైగా అది దేశంపై ప్రభావం చూపిందని సీఎం జగన్ మోడీ దృష్టికి తెచ్చారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటే, దీర్ఘకాలంలో మనం పోరాటంచేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న వివరాలను, సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్ని దాన్ని విశ్లేషించి కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతున్నాని ప్రధానికి జగన్ తెలిపారు. ఏపీలోని 676 మండలాల్లో కరోనా వైరస్ సోకిన మండలాల్లో 37 రెడ్జోన్లో ఉన్నాయి, ఆరెంజ్ జోన్లో 44 మండలాలు ఉన్నాట్లు ప్రధానికి జగన్ తెలిపారు. మొత్తంగా 676 మండలాల్లో 81 మండలాలు రెడ్జోన్, ఆరెంజ్ జోన్లో ఉన్నట్లు వివరించారుు. 595 మండలాలు మాత్రం గ్రీన్జోన్లో ఉన్నాయన్నారు. ప్రస్తుతానికి వీటిపై కరోనా ప్రభావం లేదన్నారు.
Recommended Video
అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టిన జగన్..
ఏప్రిల్ 14 తర్వాత రెడ్జోన్లకే లాక్డౌన్ పరిమితం చేయాలన్న అభిప్రాయాన్ని సీఎం జగన్ మోడీకి తెలిపారు. జనం గుమిగూడకుండా మాల్స్, సినిమాహాళ్లు, ప్రార్థనామందిరాలు, ప్రజారవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాలని మాత్రం చెప్పారు. ఇవికాకుండా మిగిలిన చోట్ల భౌతిక దూరం పాటించాలన్నది తన అభిప్రాయమన్నారు. కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా దేవుడి దయవల్ల అడ్డుకోగలుగుతున్నామని, కంటికి కనిపించని ఈ మహమ్మారి త్వరలోనే నయం అవుతుందని నమ్ముతున్నట్లు జగన్ ప్రధానికి తెలిపారు. ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడంలో అంతా ఒక్కటిగా ఉండాలని, ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగాలని జగన్ ఆకాంక్షించారు. ప్రధాని నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందని, కాబట్టి మీరు సూచించే వ్యూహంతో ముందుకుసాగుతామని జగన్ మోడీకి వివరించారు.