ఆ రెండు నిర్ణయాలతో మళ్లీ జగన్కే అధికారమా? పార్టీ ప్లీనరీలో వాటి ప్రకటన??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వాటిని ప్లీనరీలో ప్రకటిస్తున్నారు. జులై 8, 9 తేదీల్లో గుంటూరు-విజయవాడ మధ్యలో పార్టీ ప్లీనరీ జరగబోతోంది. ప్రత్యర్థి పార్టీలకు అందకుండా వారి వ్యూహాలను చిత్తుచేసేలా డేరింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడూ ముందుండే జగన్ తాను తీసుకోబోయే ఆ రెండు నిర్ణయాలు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి విజయాన్ని చేకూర్చిపెడతాయనే ఆశాభావంతో ఉన్నారు.

10 నెలల ముందుగానే అభ్యర్థుల ప్రకటన?
ఎన్నికలకు 10 నెలల ముందుగానే అభ్యర్థుల ప్రకటన, ఎవరెవరికి టికెట్లు ఇవ్వడంలేదనే విషయాన్ని ప్లీనరీ వేదికగా తెలియజేయబోతున్నట్లు సమాచారం. ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంవల్ల ఇప్పటినుంచే వారు ప్రజల్లో మమేకమవుతారని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించి ఓట్లు రాబట్టుకోవచ్చనే వ్యూహాన్ని జగన్ అమలు చేయబోతున్నారు. టికెట్లు రాని అభ్యర్థులంతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీరిలో ఎవరు పార్టీకి ఎక్కువ హాని కలిగిస్తున్నారనే అంశాన్ని విజిలెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకొని ఆ ప్రకారం వారిపై చర్యలు తీసుకునే అవకాశం కనపడుతోంది.

పార్టీని పరుగులు పెట్టించే బాధ్యత వారిదే!
ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటు రెండోసారి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసుకోవడంద్వారా ఎన్నికలకు ఆయన టీంను ఏర్పాటు చేసుకున్నట్లైంది. మాజీ మంత్రులందరికీ పార్టీ బాధ్యతలు అప్పజెప్పారు. ఎన్నికలవరకు పార్టీని పరుగులు పెట్టించాల్సిన బాధ్యత వీరిపైనే ఉంది.

సామాజిక న్యాయమే వైసీపీ విధానం
బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులతో సామాజిక న్యాయభేరి బస్సు యాత్రద్వారా ఆయా వర్గాలకు తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతనిస్తుందో ప్రజలకు తెలియజెప్పారు. అలాగే గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పార్టీ బలాబలాలు, ప్రత్యర్థి పార్టీల బలాబలాలపై ఒక అవగాహనకు వైసీపీ వచ్చింది. తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనపడుతోంది. సామాజిక న్యాయమే తమ విధానమని స్పష్టం చేయబోతోంది.












Click it and Unblock the Notifications