ఎన్నికలు వాయిదా.. ఏపీ షట్ డౌన్? సీఎం జగన్ ఎమర్జెన్సీ రివ్యూ.. గవర్నర్తో కీలక భేటీ..
కరోనా మహమ్మారి ధాటికి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఈసీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వైరస్ ప్రభావంపై ముఖ్య అధికారులతో రివ్యూ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా గుర్తించిన వెంటనే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే కీలక సూచనలు వెలువడ్డాయి. వాటిని అనుసరిస్తూ.. ఇప్పటికే ఏపీలో మినీ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన వైసీపీ సర్కారు.. దాన్ని పూర్తిస్థాయి ఎమర్జెన్సీగా మార్చేందుకు సిద్ధమైంది.
అధికారిక ప్రకటన తర్వాతే..
కరోనాకు సంబందించి రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు, కేంద్రం సూచనల నేపథ్యంలో.. పబ్లిక్ గ్యాదరింగ్స్ ను నిషేధించాలని రాష్ట్ర సర్కారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాళ్లను మూసివేతకు ఆదేశాలిచ్చేందుకు రంగం సిద్ధమైంది. అయితే దీనికి సంబందించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఏం చేద్దాం..
పొరుగురాష్ట్రం తెలంగాణలో ఆదివారం నుంచే జనసమూహాలపై నిషేధం అమల్లోకి వచ్చిన సగంతి తెలిసిందే. కేంద్రం ఆదేశాలు, తెలంగాణ సర్కారు ముందస్తు చర్యల దరిమిలా కరోనా వ్యాప్తి నివారణపై ఆదివారం సీఎం జగన్.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మంత్రి ఆళ్ల నానితోపాటు వైద్యారోగ్య శాఖ ముఖ్య అధికారులు హాజరయ్యారు.
ఏపీలో పరిస్థితి ఏంటంటే..
ఏపీలో కరోనాకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది. దీంతోపాటు మరో 70 అనుమానిత కేసుల్ని గుర్తించారు. అంతకుముందే మరో 57 కేసుల్లో టెస్టులు నెగటివ్ గా తేలాయి. 12 కేసులకు సంబంధించిన రిపోర్టులు పుణె నుంచి రావాల్సి ఉంది. వైరస్ వ్యాప్తి విషయంలో ఆందోళనకర పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా షట్ డౌన్ విధించడమే ఉత్తమమనే అభిప్రాయం రివ్యూ సహావేశంలో వెల్లడైనట్లు తెలిసింది.
గవర్నర్ తో సీఎం భేటీ..
కరోనా ఎఫెక్ట్ కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటం, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్త హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ ఆదివారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. కరోనా వైరస్ నిరోధానికి తీసుకుంటున్న చర్యలనూ ఆయన గవర్నర్ కు వివరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ గురించి కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది.