కేసీఆర్తో పాటే జగన్: ఏపీలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కోసం స్కెచ్: తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం ఇచ్చిన ఊపు అంతా ఇంతా కాదు. డబ్బులు పంచకపోయినా.. స్వయానా ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి రాకపోయినా.. ప్రజలు మాత్రం ప్రభుత్వానికి అండదండగా నిలిచారనేది బద్వేలు ఉప ఎన్నిక ఫలితం స్పష్టం చేసింది. 2019తో పోల్చుకుంటే రెట్టింపు మెజారిటీ రావడం వైసీపీ నాయకులను ఆనందంలో ముంచెత్తింది. ఓ సాధారణ అసెంబ్లీ నియోజకవర్గంలో 90 వేలకు పైగా మెజారిటీ రావడం అనేది ఓ చరిత్రగా అభివర్ణిస్తున్నారు.

వ్యతిరేకత సహజమే అయినా..
సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా.. అధికార పార్టీ కొంత వ్యతిరేక పవనాలను ఎదుర్కొనడం సహజమే. రెండున్నరేళ్ల తరువాత అంటే.. ఈ వ్యతిరేకత అనేది గరిష్ఠ స్థాయిలో ఉంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, సంక్షేమ పథకాలను కుదించడం, అభివృద్ధిపై పెద్దగా దృష్టి సారించకపోవడం, ప్రచారంతోనే కాలక్షేపం చేయడం వంటి చర్యలు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడటానికి కారణమౌతుంటాయి. దానికి తోడు ప్రతిపక్షాల ఎదురుదాడులు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొడానికి దారి తీస్తుంటాయి.

ఏపీలో మాత్రం
ఏపీలో మాత్రం దీనికి భిన్నమైన రాజకీయ పరిస్థితి నెలకొంది. వైఎస్ జగన్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నరేళ్ల తరువాత కూడా అధికార పార్టీపై వ్యతిరేకత ఏర్పడలేదు. పైగా మరింత ఆదరణను పెంచుకుంటోంది. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా ప్రతి స్థాయిలోనూ వైసీపీ మరింత బలపడుతోంది. అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేసే శక్తిసామర్థ్యాలు ఉన్న ఏ సామాజిక వర్గానికి చెందిన ఓటుబ్యాంకులోనూ తేడా రాలేదు. 2019 కంటే ఇప్పుడు మరింత బలంగా వేళ్లూనుకుని పోయింది అధికార వైఎస్ఆర్సీపీ.

ఎన్నికలే గీటురాయి..
2019 తరువాత బద్వేలు వరకు ఎదుర్కొన్న అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవడమే దీనికి నిదర్శనం. సర్పంచ్లు మొదలుకుని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవుల దాకా ఆ పార్టీదే హవా. క్లీన్స్వీప్ అనే పదానికి అసలైన నిర్వచనాన్ని ఇస్తూ వచ్చింది వైఎస్ఆర్సీపీ. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలోనూ మూడున్నర లక్షల వరకు మెజారిటీని సాధించింది. బద్వేలులో ఏకంగా 90 వేలకు పైగా ఆధిక్యాన్ని కనపరిచారు ఆ పార్టీ అభ్యర్థులు. వైఎస్ జగన్ వెంటే జనం ఉన్నారనేది దీనితో తేటతెల్లమైంది.

అదే ఊపును కొనసాగించేలా..
బద్వేలు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తరువాత వైఎస్ జగన్ ఆలోచనల్లో మార్పు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే విషయాన్ని ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రజల్లో ఉన్న ఈ ఆదరణను మరి కొన్నేళ్ల పాటు కొనసాగించుకోవడానికి వీలుగా ముందస్తు ఎన్నికలను నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయాన్ని వైఎస్ జగన్ వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో 95 శాతం వరకు హామీలను నిర్వహించామని, అది ప్రజల్లో ప్రభుత్వం విశ్వాసాన్ని కలిగించిందనేది వైసీపీ నాయకుల వాదన.

తెలంగాణతో పాటు
ఇదివరకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లి, ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం.. 2019లో అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లోనే శాసనసభను రద్దు చేశారు. అదే ఏడాది నవంబర్లో ఎన్నికలను ఎదుర్కొన్నారు. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్లీ షెడ్యూల్ ప్రకారం.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

అదే ఫార్ములాను..
అదే ఫార్ములాను అనుసరిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయం వైఎస్ జగన్లో నెలకొని ఉందనే ప్రచారం సాగుతోంది. 2023 అక్టోబర్-నవంబర్ నెలల్లో తెలంగాణతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలను నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దిశగా వైఎస్ జగన్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఆరునెలల ముందే ఎన్నికలకు వెళ్లడం వల్ల ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని మరింత బలహీన పర్చడానికి కూడా ఇది ఓ కారణమౌతుందనే ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

చెల్లికీ కలిసొస్తుందా?
వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల.. తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీని నెలకొల్పారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ఆమె జనంలోకి దూసుకెళ్తోన్నారు. ఇందులో భాగంగా 4000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేస్తోన్నారు. 2023 నాటి అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలోకి రావడమా? లేక అక్కడి రాజకీయాల్లో కింగ్ మేకర్గా నిలవడమా? అనేది వైఎస్ షర్మిల లక్ష్యం. ఏపీతో పాటు తెలంగాణలోనూ ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడం వల్ల అటు చెల్లెలి విజయానికీ వైఎస్సార్ అనే బ్రాండ్ నేమ్ తోడవుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications