సర్కారువారి పాటపై వైసీపీ బ్రాండ్: బ్యానర్లల్లో జగన్, వంగవీటి రంగా, ఎమ్మెల్యేల ఫొటోలు
అమరావతి: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం.. సర్కారువారి పాట. ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కీర్తి సురేష్ హీరోయిన్. పరశురామ్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంది. కామెడీ నటుడు వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటించారు. సరిలేరు నీకెవ్వరు తరువాత మహేష్ బాబు నటించిన సినిమా ఇదే. రెండున్నరేళ్ల తరువాత మహేష్ బాబు సినిమా విడుదల కాబోతోండటంతో దీనిపై ఉన్న అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
అప్పట్లో వాయిదా పడ్డా..
నిజానికి- షెడ్యూల్ ప్రకారం.. ఈ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకొని రావడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షలను విధించాయి అప్పట్లో. అదే సమయంలో ఏపీలో సినిమా టికెట్ల వివాదం నడుస్తోండటం కూడా ఈ సినిమా విడుదల వాయిదా పడటానికి ఓ కారణమైంది. టికెట్ల రేట్ల వివాదం ముగియడంతో అప్పటివరకు విడుదలకు సిద్ధమైన సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కట్టాయి.
12న విడుదలకు సిద్ధం..
సంక్రాంతి బరి నుంచి తప్పుకొన్న తరువాత ఏప్రిల్ మొదటివారంలో సర్కారువారి పాటను విడుదల చేయాలని చిత్రం యూనిట్ మొదట నిర్ణయించుకుంది. అయినప్పటికీ.. ఆ తేదీకి కూడా విడుదల కాలేకపోయింది. ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్, జూనియర్ ఎన్టీఆర్- రామ్చరణ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్, చిరంజీవి ఆచార్య విడుదల కావాల్సి ఉండటం వల్ల వెనక్కి తగ్గిందీ మూవీ. థియేటర్ల సమస్య తలెత్తకుండా ఉండటానికి ఒక అడుగు వెనక్కి వేసింది. ఎట్టకేలకు 12వ తేదీన విడుదల కాబోతోంది.
మొదలైన మేనియా..
ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సైతం ముగిసింది. హైదరాబాద్ యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం ముగిసినప్పటి నుంచీ సర్కారువారి పాట మేనియా మొదలైంది. దీనితోపాటే అభిమానుల సందడి కూడా. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ తమ ఏర్పాట్లను ముమ్మరం చేసుకుంటోన్నారు ఘట్టమనేని కుటుంబం ఫ్యాన్స్. విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, కడప, గుంటూరు, ఏలూరు, కాకినాడ.. ఇలా తేడాలేవీ ఉండట్లేదు. అటు శ్రీకాకుళం నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకు మహేష్ బాబు ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది.
గ్రాండ్ వెల్కమ్ కోసం..
సర్కారువారి పాటకు సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు విస్తృతంగా వెలిశాయి. సరిలేరు నీకెవ్వరు తరువాత సుదీర్ఘ విరామం అనంతరం విడుదలవుతోన్న మూవీ కావడం..ఈ రెండున్నరేళ్ల ఎదురు చూపులు ఫలిస్తోండటంతో అదే రేంజ్లో మూవీ విడుదలకు సమాయాత్తం అయ్యారు అభిమానులు. దీనికి అనుగుణంగా ఈ సినిమా విడుదలను గ్రాండ్గా జరుపుకొంటున్నారు.
తమదిగా భావిస్తున్న వైసీపీ ఫ్యాన్స్..
కాగా- ఈ సినిమాను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తమ సొంత సినిమాగా భావిస్తున్నట్టే కనిపిస్తోంది. ఈ మూవీని వారు ఓన్ చేసుకున్నారు. చాలా చోట్ల అభిమానులు ఏర్పాటు చేసిన సర్కారువారి పాట బ్యానర్లల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోలు కనిపించాయి. సూపర్ స్టార్, ఘట్టమనేని మహేష్ బాబు-వైఎస్ జగన్ మ్యూచువల్ ఫ్యాన్స్ పేరిట అసోసియేషన్లు సైతం ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వంగవీటి రంగా.. మల్లాది విష్ణు
వైఎస్ జగన్ ఫొటోలను ముద్రించడానికే పరిమితం కాలేదు అభిమానులు. దివంగత కాపు నేత వంగవీటి రంగా ఫొటోలు సైతం కనిపించాయి. మహేష్ బాబు, వంగవీటి రంగాకు చెందిన నిలువెత్తు ఫొటోలను ముద్రించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రత్యేకించి- విజయవాడలో పెద్ద ఎత్తున కట్టారు. విజయవాడ సెంట్రల్కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు ఫొటోలను ముద్రించిన బ్యానర్లు విస్తృతంగా దర్శనం ఇచ్చాయి.
ఆ డైలాగ్తో..
నేను విన్నాను.. నేను ఉన్నాను.. అనే డైలాగ్ వైసీపీ క్యాడర్ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేసిన సమయంలో ఈ డైలాగ్ను వైఎస్ విస్తృతంగా ప్రయోగించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంపై మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన యాత్ర సినిమాలోనూ ఈ డైలాగ్ ఉంది. ఆ సినిమా కూడా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా సర్కారువారి పాటలో అదే డైలాగ్ను వాడటం- వైఎస్ఆర్సీపీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.