సీఎం జగన్ తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ... ఛలో విజయవాడపైనే భేటీలో కీలకచర్చ!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తో భేటీ అయ్యారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గౌతమ్ సవాంగ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. సుమారు అరగంట పాటు వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఛలో విజయవాడ అంశంపై ఎక్కువ చర్చ జరిగినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇటీవల వైసీపీ సర్కార్ జారీ చేసిన పీ ఆర్ సి జీవోలు రద్దు చేయాలంటూ ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నిర్బంధాలు, ఆంక్షలు పెట్టినప్పటికీ ఉద్యోగుల పోరాటం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Recommended Video

ఉద్యోగులకు పోలీసులు సహకరించారా? డీజీపీకి ఏపీ సీఎం ప్రశ్న
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగుల పోరాటం విజయవంతం కావడంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక ఉద్యోగులకు పోలీసులు సహకరించారా అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆరా తీసినట్లు సమాచారం. ఉద్యోగుల రాకను అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ విఫలమైనట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఇంటెలిజెన్స్, నిఘా వ్యవస్థ పనితీరు పై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం.

ఛలో విజయవాడ ఎలా సక్సెస్ అయ్యింది .. వివరణ అడిగిన సీఎం
ఛలో విజయవాడకు తక్కువ మంది వస్తారు అని పోలీసులు అంచనా వేసినా, అందుకు భిన్నంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోటెత్తడంతో భిన్నమైన పరిస్థితి చోటు చేసుకుంది. రాష్ట్రంలో నలుమూలల నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో విజయవాడకు చేరుకొని జగన్ సర్కారు తీరుపై తమ నిరసన వ్యక్తం చేశారు. కేవలం నిమిషాల వ్యవధిలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యోగులతో నిండిపోయింది. ఛలో విజయవాడ కార్యక్రమంలో ఊహించని విధంగా చోటు చేసుకున్న పరిణామాలన్నీ ఎలా జరిగాయాన్న అంశంపైన కూడా డీజీపీ గౌతమ్ సవాంగ్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి వివరణ అడిగినట్లు తెలుస్తోంది.

జగన్ కు ఛలో విజయవాడను ఎందుకు అడ్డుకోలేకపోయామో వివరించిన డీజీపీ
డీజీపీ గౌతమ్ సవాంగ్ ఛలో విజయవాడను అడ్డుకోవడం కోసం పోలీసులు చేసిన ప్రయత్నాలను, ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసులు తీసుకున్న చర్యలను సీఎం జగన్మోహన్ రెడ్డికి సవివరంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు మారువేషాల్లో వచ్చారని, ముందే విజయవాడకు చేరుకుని బస చేశారని, ఈ క్రమంలో ఉద్యోగుల నిరసనను తాము అడ్డుకోలేక పోయామని డీజీపీ గౌతమ్ సవాంగ్ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే ఇలాంటి విషయాలపై భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలన్న దానిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి పలు సూచనలు చేసినట్లుగా సమాచారం.

పరిస్థితి తీవ్రత దృష్ట్యా జగన్ ను కలిసిన డీజీపీ గౌతమ్ సవాంగ్
ఇదిలా ఉంటే ఉద్యోగుల సభపై గురువారం నాడు కూడా పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమై చర్చించారు. ఇక ఆ భేటీకి డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరుకాలేదు. తాజా పరిస్థితి తీవ్రత దృష్ట్యా డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈరోజు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. ఇక ఈ నెల 6వ తేదీ నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు దిగుతున్నట్లు ఇప్పటికే పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించిన నేపథ్యంలో ముందు ముందు పరిణామాలను ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న సంకటంలో వైసిపి ప్రభుత్వం పడింది.












Click it and Unblock the Notifications