వైయస్సార్ బీమా పథకం కింద రూ. 254 కోట్లు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
అమరావతి: ఆకస్మిక విపత్తు కారణంగా ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు వైయస్సార్ బీమా పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఆర్తిక సహాయం అందజేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు.
ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 2020, అక్టోబర్ 21న పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఈ తరహాలో మరణించిన 12,039 మంది వ్యక్తుల కుటుంబసభ్యులకు రూ. 254 కోట్లు చెల్లించనున్నారు. కాగా, ఈ పథకం కోసం చేపట్టిన సర్వేలో అర్హులుగా గుర్తించినప్పటికీ.. పేరు నమోదు చేసుకోకముందే మరణించిన వారి కుటుంబాలకు కూడా బీమా సొమ్మును చెల్లించాలని సీఎం జగన్ మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకున్నారు.
గతం మాదిరిగా పీఎంజేజేబీవై, ప్రధానమంత్రి సురక్ష యోజన కింద 50 శాతం వాటా లేనప్పటికీ పూర్తిగా.. రాష్ట్ర ప్రభుత్వమే పథకం అమలు చేస్తుందన్నారు. సహజ మరణానికి రూ. 2 లక్షలు, ప్రమాద మరణం, శాశ్వత అంగ వైకల్యానికి రూ. 5 లక్షలు(18-50ఏళ్ల వయస్సు) , రూ. 3 లక్షలు(51-70ఏళ్లు) బీమా, పాక్షిక శాశ్వత అంగవైకల్యానికి రూ. 1.5 లక్షలు అందించనున్నారు.
ఏటా రూ. 510 కోట్లతో 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా ఇస్తున్నామని సీఎం తెలిపారు. కేంద్ర సాయం లేకున్నా బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని పేర్కొన్నారు. గతంలో ఉండే గ్రూప్ ఇన్స్యూరెన్స్ ను కూడా తొలగించారని, వ్యక్తిగతంగా అకౌంట్ ఉన్న వారికే బీమా సౌకర్యం కల్పించారన్నారు. వాలంటీర్ల ద్వారా కొత్తగా 61 లక్షల మంది అకౌంట్లను ప్రారంభించామన్నారు. ఆ కుటుంబాలను కూడా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు సీఎం జగన్.