పని తక్కువ..హడావుడి ఎక్కువ: ఆ ఇద్దరితో నిత్యపోరాటం: వైఎస్ జగన్
అమరావతి: రాష్ట్రంలో కొనసాగుతోన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రోత్సాహక మొత్తాన్ని విడుదల చేశారు. దీని విలువ 1,124 కోట్ల రూపాయలు. ఎంఎస్ఎంఈలతో పాటు టెక్స్టైల్స్, స్పిన్నింగ్ మిల్లుల కోసం ఉద్దేశించిన నగదు బదిలీ ఇది. ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలను విడుదల చేయడం ఇది రెండోసారి. ఈ మధ్యాహ్నం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మొత్తాన్ని బదలాయించారు. ఇప్పటిదాకా 2,086 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం మంజూరు చేసింది.

కరోనా కాలంలోనూ..
అనంతరం కొద్దిసేపు మాట్లాడారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులోనూ సంక్షేమ పథకాలను ఆపకుండా అటు ప్రజలు.. ఇటు పరిశ్రమలను కాపాడుకుంటూ వస్తోన్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్స్ను ఆదుకుంటూనే..మరో వైపు 25 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇందులో భాగంగా కడప జిల్లాలో వైఎస్ఆర్-జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. దీని ద్వారా 75 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ పార్క్
కడప జిల్లాలోని కొప్పర్తిలో వైఎస్సార్ ఈఎంసీ పార్కును కూడా స్థాపిస్తున్నామని, దీని ద్వారా 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 730 కోట్ల రూపాయల వ్యయంతో 801 ఎకరాల్లో ఈ ఎలక్ట్రానిక్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దీని ద్వారా మరో 30 వేల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి అవకాశం ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. పారిశ్రామిక రంగానికి నిరంతరాయంగా విద్యుత్, రోడ్లు, నీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని వివరించారు.

ర్యాంకింగ్లో మొదటి స్థానం..
పారిశ్రామిక రంగంలో మొట్ట మొదటి సారిగా పారిశ్రామిక వేత్తల ఫీడ్ బ్యాక్ తీసుకొని వరల్డ్బ్యాంకు కొత్తగా ర్యాంకులను ప్రకటించిందని, ఇందులో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని వైఎస్ జగన్ అన్నారు. పెట్టుబడిదారులు కూడా ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి ఈ ర్యాంకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఎంఎస్ఎంఈల ద్వారా మరో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, ఇలాంటి సెక్టార్ను ఆదుకోవడం అంటే..పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చినట్టేనని చెప్పారు. మధ్యతరహా పరిశ్రమలను కాపాడగలిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడగలుగుతుందని పేర్కొన్నారు.

12 లక్షల మందికి పైగా ఉపాధి..
రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్స్, స్పిన్నింగ్ మిల్లుల కోసం 1,124 కోట్ల రూపాయల ప్రోత్సహకాలను విడుదల చేశామని, ఇందులో అర్హత పొందిన ఎంఎస్ఎంఈలకు నేరుగా 440 కోట్ల రూపాయలు, టెక్స్టైల్స్ కంపెనీలకు మరో 230 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్తాయని వైఎస్ జగన్ చెప్పారు. టెక్స్టైల్ మిల్లులకు ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయలను కూడా విడుదల చేశామని అన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించామని ఆయన వివరించారు.

వారిద్దరి దుష్ప్రచారం..
రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తోంటే..టీడీపీ, ఎల్లోమీడియా దుష్ర్పచారం చేస్తున్నాయని వైఎస్ జగన్ విమర్శించారు. గతంలో హడావిడి ఎక్కువ, పని తక్కువగా ఉండేదని ఆయన ఎద్దేవా చేశారు. భారీ సమ్మిట్లు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ హడావుడీ, ప్రచారం చేసుకోవడం తప్ప మరొకటి చేత కాలేదని ఆయన అన్నారు. లక్షల కోట్ల రూపాయల మేర ఒప్పందాలు కుదిరాయని, ఎల్లో మీడియా ద్వారా రోజూ ప్రచారం చేసుకునే వారని ధ్వజమెత్తారు. అవేమీ లేకుండా, ప్రజలను మభ్యపెట్టకుండా, పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు ఇచ్చామని అన్నారు.

ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధి..
విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, సీబీఐసీ, హైదరాబాద్- బెంగళూరు కారిడార్లను అభివృద్ధి చేస్తోన్నామని, 2,139 కోట్ల రూపాయల అంచనాతో సుమారు 13 వేల ఎకరాల విస్తీర్ణంలో కృష్ణపట్నం గ్రీన్ఫీల్డ్గా మార్చబోతోన్నామని వైఎస్ జగన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 62 శాతం, మహిళలకు 42 శాతం ప్రోత్సాహకాలు అందించామని చెప్పారు. పరిశ్రమలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం చేశామని గుర్తు చేశారు. ఇవే కాక గ్రామీణస్థాయిలో కూడా ఉపాధి కల్పించడానికి చేయూత, ఆసరా వంటి కార్యక్రమాల ద్వారా అమూల్, ఐటీసీ, రిలయన్స్ వంటి భారీ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని మహిళలకు అండగా నిలిచామని అన్నారు.












Click it and Unblock the Notifications