మీ బిడ్డ నమ్ముకుంది పైన దేవుడిని, మిమ్మల్ని మాత్రమే : సీఎం జగన్
తాజాగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న చేదోడు సాయాన్ని నేడు ఎమ్మిగనూరులో బటన్ నొక్కి ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లోని వీవర్స్ కాలనీలో వై డబ్ల్యూ సి ఎస్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గత పాలనకు ప్రస్తుత పాలనకు తేడా చూడాలని ఇచ్చిన మాటను 52 నెలల కాలంలో నిలబెట్టుకున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు అండగా జగనన్న చేదోడు అందజేస్తున్నామని పేర్కొన్న జగన్, తమ పాలనలో ఎక్కడ అవినీతి జరగకుండా, లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను నేరుగా అందిస్తున్నామన్నారు.

అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచేసింది అని, అప్పట్లో అభివృద్ధి ఎందుకు జరగలేదో ప్రజలు ఆలోచించాలన్నారు. చంద్రబాబు పాలన చూస్తే కుప్పంలో కూడా ఆయన మా వాడే అని చెప్పుకునే పరిస్థితి లేదని, కుప్పం ప్రజలకు కనీసం చంద్రబాబు ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేదని కానీ తమ ప్రభుత్వ హయాంలో కుప్పంలో ఇళ్ల స్థలాలు ఇచ్చామని, నిర్మాణాలు కూడా చేపట్టామని చెప్పారు జగన్.
ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకువచ్చి చంద్రబాబు ఎన్నికల తర్వాత దాన్ని చెత్తబుట్టలో పడేశారని, కానీ తమ మేనిఫెస్టో లోని అంశాలను 99 శాతం అమలు పరచామని చెప్పారు. చంద్రబాబు రుణమాఫీ చేయలేదని, ఆయన పాలనలో సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేసారు అని గుర్తు చేశారు. రాజధాని అమరావతి భూముల నుండి స్కిల్ స్కామ్ వరకు అన్నీ అవినీతి చేశారంటూ విరుచుకుపడ్డారు.
గతంలో ఏ పనులు కావాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేదని పేర్కొన్న జగన్ ప్రస్తుతం ఇంటి వద్దకే పౌర సేవలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అందరికీ ఉచిత వైద్యాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. మీ బిడ్డకు అరడజన్ టీవీ చానళ్ళ సపోర్టు లేదని, మీ బిడ్డ నమ్ముకుంది కేవలం పైన దేవుడిని, మిమ్మల్ని మాత్రమేనని జగన్ పేర్కొన్నారు.
పేదవాడు ఒకవైపు పెత్తందారు మరొకవైపు అని పేర్కొన్న జగన్ రేపు తోడేళ్లు అందరూ ఏకమవుతారు అని వాళ్లు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని, మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే ఆలోచించాలని సూచించారు.ప్రతిపక్షాలను తనదైన శైలిలో టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications