మోదీ సార్.. చాలా థ్యాంక్స్, ఏపీకి గొప్ప సహాయం చేస్తున్నారు: సీఎం జగన్ -కరోనా కట్టడి, వ్యాక్సిన్లపై -video
వివాదాస్పద బిల్లులు మొదలుకొని, వీలు చిక్కిన ప్రతిసారి కేంద్రంలోని బీజేపీ సర్కారుకు బేషరతుగా సమర్థిస్తూ, ప్రధాని మోదీ వ్యతిరేకులను సైతం సున్నితంగా హెచ్చరిస్తూ ప్రోటోకాల్ పరంగా, రాజకీయంగా తనదైన శైలిని ప్రదర్శిస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇప్పుడు మరోసారి ఆయన ప్రధాని మోదీని ఆకాశానికెత్తేశారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో ఏపీకి గొప్ప సహాయం అందిస్తున్నారంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు జగన్. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపైనా ఏపీ సీఎం కీలక సూచనలు చేశారు..

సీఎంలతో ప్రధాని కాన్ఫరెన్స్
దేశంలో కరోనా మహమ్మారి మూడో దశ విలయం ప్రారంభ ఛాయలు కనిపిస్తున్నాయన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. తొలుత ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా ముఖ్యమంత్రులతో కొవిడ్ సమీక్ష జరిపారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్.. ప్రధానిని ఉద్దేశించి మాట్లాడుతూ..

మోదీ సార్.. చాలా థ్యాంక్స్
''కోవిడ్ నివారణలో ఏపీకి మీరు అందిస్తున్న సహాయానికి చాలా కృతజ్ఞతలు. రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నాం. అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేవు. ఏపీలో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి టైర్ 1 నగరాలు లేవు. అయినాసరే కోవిడ్ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచాం. రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్ విస్తరణను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేశాయి. ఇప్పటివరకు 12 సార్లు ఇంటింటికీ ఫీవర్ సర్వే చేశాం. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, ఫోకస్గా టెస్టులు చేశాం. దీనివల్ల కోవిడ్ విస్తరణను అడ్డుకోగలిగాం. వ్యాక్సినేషన్ అనేది కోవిడ్కు సరైన పరిష్కారం. దీనికి సంబంధించి కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నా..

ప్రైవేటు కోటా వ్యాక్సిన్లు సర్కారుకు..
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి 1,68,46,210 వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. సమర్థవంతమైన విధానాలు పాటిస్తూ వాటికంటే అదనంగా మేం, 1,76,70,642 మందికి వ్యాక్సిన్లు ఇచ్చాం. జూలై నెలలో 53,14,740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారు. అందులోనూ ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారు. కాని క్షేత్రస్థాయిలో ప్రైవేటుకు కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో పంపిణీ జరగడంలేదు. గత నెలలోప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమే. కాబట్టి,ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన వ్యాక్సిన్ డోసుల స్టాకు కోటాను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికే కేటాయించాలని కోరుతున్నాం. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహదపడుతుంది. కోవిడ్ నివారణలో మీ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగుతాం'' అని ఏపీ సీఎం జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications