కిరణ్ రెడ్డిపైనే నిందలు: డిగ్గీతో చిరంజీవి, రఘువీరా
న్యూఢిల్లీ: సొంత పత్రిక, ఛానెల్ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేయాలని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్కు ఎపిపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో దిగ్విజయ్ సింగ్ సమక్షంలో పార్టీ పరాజయం, భవిష్యత్తులో బలోపేతం అనే అంశాలపై సమీక్ష జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెసు రాష్ట్ర నాయకులు ఫిర్యాదు చేశారు.
కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, జైరాం రమేశ్, పళ్లంరాజు, జేడీ శీలం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు పాల్గొన్నారు. ఈ నెల 17న విజయవాడ స మావేశంలో 52 మంది నాయకులు వెలిబుచ్చిన అభిప్రాయాలను రఘువీరా నివేదిక రూపంలో సమర్పించారు. రెండు గంటలకుపైగా సాగిన ఈ సమీక్షలో రఘువీరా సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి 14 కారణాలను, బలోపేతం చేయడానికి 16 సూచనలు చేశారు.

పార్టీ ఓడిపోవడానికిగల ప్రధాన కారణాల్లో పదేళ్లపాటు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, ధరల పెరుగుదల, సబ్సిడీలకు ఆధార్ను అనుసంధానించడాన్ని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్కుమార్రెడ్డి, అధిష్టానానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టారని, రహస్య ఎజెండాతో పార్టీని నాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించిన తీరు ప్రజల్ని బాధించిందని వివరించారు.
విభజన పాపం ఒక్క కాంగ్రెస్దేనని మీడియా పదేపదే ప్రచారం చేయడంవల్ల పెద్ద నష్టం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను వైసీపీ ప్రచారం చేసుకోవడం, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడడం వైఫల్యానికి కారణాలుగా నివేదికలో స్పష్టం చేశారు. టిడిపి, బిజెపి-జనసేన ప్రచారం, హామీలు జనాన్ని ఆకర్షించాయని నివేదికలో తెలిపారు. పార్టీకి పునర్వైభవం కలిగించాలంటే, ఒకటి రెండు నెలల్లోనే అన్ని స్థాయిల్లోనూ పునరుద్ధరించాలని సూచించారు.
పార్టీలో అతి ప్రజాస్వామ్యాన్ని కత్తిరించాలని సూచించారు. సొంతంగా పత్రిక, న్యూస్ ఛానెల్ను ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేయాలని బలోపేతం చేయాల్సిన అంశాల్లో కాంగ్రెసు నాయకులు చెప్పారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ వంటి వాటికి ఎన్నికలు జరపొద్దని, పిసిసికే నియామక అధికారం ఇవ్వాలని కోరారు.












Click it and Unblock the Notifications