చరిత్రలో డార్క్ డే: టీడీపీపై నిప్పులు: లేఖ చెల్లదని ప్రకటించి.. తనంతట తాను ఎలా?
అమరావతి: ఏపీ వికేంద్రీకరణ బిల్లును శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపించడం పట్ల విమర్శలు వ్యక్తమౌతున్నాయి. మండలి ఛైర్మన్ తన విచక్షణాధికారాలను వినియోగించుకుని మరీ.. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడం పట్ల సరికొత్త వివాదానికి, చర్చకు తెర తీసినట్టు కనిపిస్తోంది. ఛైర్మన్ తన విచక్షణాధికారాలను వినియోగించి ఓ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించిన సందర్భాలు శాసనమండలి చరిత్రలోనే లేవని అంటున్నారు.
శాసన మండలి చరిత్రలో చీకటిరోజు..
మండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్.. తన విచక్షణాధికారాలను వినియోగించకోవడం అనేది నిబంధనలకు విరుద్ధమని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ అన్నారు. వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ మెజారిటీ సభ్యుల సంఖ్య ఉన్న తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖను చెల్లదని ఛైర్మన్ అంతకుముందే ప్రకటించారని గుర్తు చేశారు. మెజారిటీ సభ్యులే ఇచ్చిన లేఖ చెల్లదని ప్రకటించిన ఛైర్మనే.. తనంతట తానుగా ఎలా నిర్ణయాన్ని తీసుకోగలుగుతారని ఆయన ప్రశ్నించారు.
పద్ధతి ప్రకారం లేఖ రాయలేదు..
శాసన మండలి నిబంధనలకు లోబడి, దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇచ్చిన లేఖ లేదనే సమాచారం తనకు ఉందని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, శాసన మండలి అధికారులు స్పష్టం చేసిన విషయాన్ని ఛైర్మన్ సైతం అంగీకరించారని చెప్పారు. అలా అంగీకరించిన తరువాత కూడా ఛైర్మన్ తనకు తానుగా సొంత నిర్ణయాన్ని తీసుకోవడాన్ని కే నాగేశ్వర్ శాసన మండలి చరిత్రలో చీకటిరోజుగా అభివర్ణించారు.
జాప్యం జరుగుతుందే తప్ప, అడ్డుకోలేరు..
ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఎంతటి కీలకమైనదో తెలుసునని, ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారిన ఇలాంటి కీలకమైన బిల్లును ఆమోదించడంలో శాసనమండలిలో కొద్దిరోజుల పాటు జాప్యం జరుగుతుందే తప్ప.. పూర్తిగా అడ్డుకోలేదని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. బిల్లును సెలెక్ట్ పంపించడం వల్ల అధికార పార్టీకి వచ్చిన ఇబ్బందులేమీ ఉండబోవని అన్నారు. శాసన మండలి ఈ బిల్లును బయటికి రాకుండా అడ్డుకుంటుందనుకోవడం అపోహ మాత్రమేనని చెప్పారు. గడువు దాటిన తరువాత.. దాన్ని ఆమోదించుకునే హక్కు శాసనసభకు ఉందని అన్నారు.
మూడు నెలలే
సెలెక్ట్ కమిటీకి పంపించిన ఏ బిల్లులైనప్పటికీ.. మూడు నెలల్లోపల వాటిపై నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని ప్రొఫెసర్ కే నాగేశ్వర్ అన్నారు. ఈలోపే దాన్ని ఆమోదించుకోవడానికి ప్రభుత్వం తనవంతు ప్రయత్నాలు చేస్తుందని, విజయం కూడా సాధించగలదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఏదేమైనప్పటికీ.. ఛైర్మన్ తన విచక్షణాధికారాలను వినియోగించం అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరగాల్సి ఉందని, భవిష్యత్తులో ఛైర్మన్ స్థానంలో కూర్చున్న ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడైనా, కీలక బిల్లులపై తన విచక్షణాధికారాలను వినియోగించుకోవడానికి అవకాశం కల్పించినట్టయిందని వ్యాఖ్యానించారు.