ఫోన్ ట్యాపింగ్లో ట్విస్ట్: చంద్రబాబుకు డీజీపీ లేఖ: ఆధారాలు ఉంటే: మాస్టర్ స్ట్రోక్: బీజేపీ నేత
అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త దుమారం చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. అత్యంత సున్నితమైన ఫోన్ ట్యాపింగ్ అంశం చుట్టూ రాజకీయాలు తిరిగేలా ఉన్నాయి. ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయడంతో ఆరంభమైన ఈ వివాదం.. అనూహ్య మలుపు తీసుకుంది. ఇందులో ఏపీ పోలీసులు జోక్యం చేసుకోవడం అనూహ్య పరిణామంగా భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుడొకరు దీన్ని మాస్టర్స్ట్రోక్గా అభివర్ణించారు.

ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు..
రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు పెద్దలు ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, ఇలాంటి చర్యలు రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని ఆరోపిస్తూ చంద్రబాబు.. ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21 సహా వైసీపీ ప్రభుత్వం ప్రాథమిక హక్కుల అణచివేత వంటి చర్యలకు జగన్ ప్రభుత్వం పాల్పడుతోందని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. దేశ భద్రతకే పెను ప్రమాదంగా పరిణమించిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

డీజీపీ ఎంట్రీ
ఈ వ్యవహారంపై రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ స్పందించారు. చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారనడానికి సాక్ష్యాధారాలు ఉంటే.. తమ అందజేయాలని విజ్ఙప్తి చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి తాము ఎలాంటి కఠిన చర్యలకైనా ఉపేక్షించబోమని అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తును నిర్వహిస్తామని చెప్పారు. దర్యాప్తునకు సహకరించాలని కోరారు.

ఎలాంటి ఫిర్యాదులూ అందలేదంటూ..
కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఙానంతో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని గౌతమ్ సవాంగ్ గుర్తు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదులు తమకు అందలేదని చెప్పారు. అయినప్పటికీ.. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్-1885, ఐటీ యాక్ట్-2000 కింద సున్నితమైన అంశం కావడం వల్ల తాము దర్యాప్తు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు
సాక్ష్యాధారాలు ఉంటే అందజేయండి..
ఫోన్ ట్యాపింగ్ చేశారనడానికి తగిన సాక్ష్యాధారాలను తమకు అందజేయాలని గౌతమ్ సవాంగ్.. చంద్రబాబుకు విజ్ఙప్తి చేశారు. దీనిపై తాము దర్యాప్తు సాగిస్తామని, నిందితులపై చట్టపరంగా చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. ప్రతి పౌరుడికీ రాజ్యాంగం గోప్యత హక్కును కల్పించిందని, దాన్ని కాపాడటంలో రాజీపడబోమని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై దర్యాప్తు ముందుకు సాగడానికి సహకరించాలని ఆయన చంద్రబాబును కోరారు.
Recommended Video

మాస్టర్స్ట్రోక్గా అభివర్ణించిన బీజేపీ నేత
ఈ వ్యవహారంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ జోక్యం చేసుకోవడం ఏ మాత్రం ఊహించనిదే. దీన్ని మాస్టర్స్ట్రోక్గా అభివర్ణించారు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు. ప్రభుత్వం తరఫున చంద్రబాబుకు ఇచ్చిన మాస్టర్స్ట్రోక్గా పేర్కొంటూ ఓ ట్వీట్ చేశారు. తన ట్వీట్కు గౌతమ్ సవాంగ్ రాసిన లేఖను జత చేశారు. సాక్ష్యాధారాలు ఉంటే.. ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర దర్యాప్తును జరిపించాల్సిన అవసరం ఉందంటూ ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications