జగన్ సర్కార్ కు ఉద్యోగుల డెడ్ లైన్- ఇక నో చర్చలు ! సంక్రాంతి లోపు పరిష్కరించకపోతే.. !
ఏపీలో ఉద్యోగుల జీతాల చెల్లింపు సహా పలు పెండింగ్ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఉద్యోగ సంఘాల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఇవాళ విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు... పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
విజయవాడలో 90 ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న నేతలు.. ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఫిబ్రవరి 5న ఏపీ జేఏసీ అమరావతి మూడో మహాసభ కర్నూలులో నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి వేలాదిగా ఉద్యోగులు తరలి రావాలని పిలుపిచ్చారు. ఉద్యోగులు సమస్యలపై ఇవాళ సమావేశం వాడివేడిగా సాగింది. ఇందులో పాల్గొన్న జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు.

తమకు రావాల్సిన వేలకోట్ల రూపాయలు ఇవ్వకపోగా, ప్రతి నెలా భత్యాలు కూడా ఒకటో తేదీకి ఇవ్వడం లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. రెండేళ్లు పాటు భరించామని, ప్రభుత్వానికి ఇదో అలవాటుగా మారిందన్నారు. జీతాలు, పెన్షన్ లు ఇరవై తేదీ అయినా ఇవ్వడం లేదన్నారు. జీత,భత్యాల కోసం ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ బకాయిలు అడగకూడదనే జీతాలు ఆలస్యం చేస్తున్నారా అని ప్రభుత్వాన్ని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తాము దాచి పెట్టుకున్న డబ్బులు కోట్ల రూపాయలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, ఆ డబ్బులు తమకు ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
పదవీ విరమణ చేసిన రోజే బెన్ ఫిట్స్ ఇచ్చి పంపాలని నిబంధన ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు గుర్తుచేశారు.
ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు మథన పడుతున్నారన్నారు. రిటైర్ అవ్వాలంటే ఉద్యోగులు భయ పడుతయన్నారన్నారు. ఉద్యోగి చనిపోతే మట్టి ఖర్చు కూడా ఇవ్వడం లేదన్నారు. అధికారి తన జేబులో డబ్బు ఇస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు,పెన్షనర్ల వద్ద డబ్బు కట్ చేసి వెనక్కి తీసుకున్నారని, ఇన్ని వేలకోట్ల రూపాయల బకాయిలు ఛలో విజయవాడతో వచ్చాయన్నారు. సిఎంతో చర్చల్లో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని,
ఇప్పుడు ఒక్క రూపాయి ఇవ్వకపోగా, జీతాలు కూడా ఇవ్వడం లేదన్నారు.ఛలో విజయవాడ తర్వాత చెల్లింపులో పురోగతి లేదన్నారు.
సీపీఎస్ రద్దు, ఉద్యోగాలు పర్మినెంట్, జీత భత్యాల చెల్లింపు అన్నారని, స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. అసలు మా డబ్బు మాకు ఇస్తారా.. కనీసం మేము కష్టపడి పని చేసినా జీతం ఇవ్వరా అని ప్రశ్నించారు. తాము ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. బకాయిలు చెల్లింపు, ఒకటో తేదీన జీత భత్యాల పై సిఎం సమావేశం పెట్టాలన్నారు.
వీటిపై ఉద్యోగ సంఘాలు తో చర్చ చేసి హామీ ఇవ్వాలన్నారు. అధికారులు, మంత్రి వర్గ ఉప సంఘం హామీ ఇవ్వలేక పోతుందని, సిఎం స్వయంగా వీటిపై స్పందించాలని కోరుతున్నామన్నారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే సంక్రాంతి తరువాత ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
సీపీఎస్ పై పదేపదే చర్చ ల పేరుతో ఎందుకు పిలుస్తున్నారని ప్రభుత్వాన్ని బొప్పరాజు వెంకటేశ్వర్లు నిలదీశారు.
ఓపియస్, సిపియస్ రెండే కదా దేశంలో ఉందని, వీటిపై సమావేశం పేరుతో మమ్మలని ఎందుకు ఇబ్బంది పెడతారని అడిగారు. సిఎం సిపియస్ రద్దు చేస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. ఆరు రాష్ట్రాల్లో సిపియస్ రద్దు చేశారని, తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో రద్దు చేశారని, సిక్కిం కూడా కమిటీ వేసిందన్నారు. ఇక చర్చలతో పని లేదు... మేము వెళ్లేది లేదన్నారు. పాత పెన్షన్ విధానం తప్ప, మరొకదానికి అంగీకరించమన్నారు. 1వ పిఆర్సీ విషయంలో ఉద్యోగుల నుంచి తమపై తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. 11వ పిఆర్సీ లో జరిగిన అవకతవకలు వల్ల ఉద్యోగులు నష్టపోయారని బొప్పరాజు వెంకటేశ్వర్లు గుర్తుచేశారు. 12వ పిఆర్సీ కమిషన్ ద్వారా నివేదిక తెప్పించు కోవాలని, తమకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలన్నారు.
ప్రభుత్వంలో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిపోతుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అనుభవం కలిగిన తహశీల్దారు కూడా ఉరి వేసుకున్నాడని ఆరోపించారు. రీ సర్వే, వ్యవసాయం, ఇళ్ల స్థలాలు, ధాన్యం సేకరణ, వంటి పనులు ఒకేరోజు అప్పగిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్లకు ర్యాంకింగ్ లు పెట్టి ఇబ్బంది పెడుతున్నారన్నారు.
దీని వల్ల పనిభారంతో ఒత్తిడి తట్టుకోలేక పోతున్నారని తెలిపారు. గతంలో సిఎం చెప్పిన విధంగా పది నుంచి ఆరు వరకు పనివేళలు అమలు చేయాలన్నారు. ఆత్మహత్య లు పరిష్కారం కాదని ఉద్యోగులకు మనవి చేస్తున్నామన్నారు. నీతిగా పని చేసినంత కాలం మీకు ఏ ఇబ్బంది ఉండదన్నారు. కరోనా సమయంలో అనేక మంది ఉద్యోగులు చనిపోయారని, కారుణ్య నియామకాల విషయంలో ప్రభుత్వం ఒన్ టైం కింద నియమించాలన్నారు.
ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా, కొంతమంది అధికారులు సొంత నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు.ఫ్రంట్ లైన్ అనే కొలమానాలు పెట్టి జీవితాలను నాశనం చేయకండని కోరారు. ఆయా శాఖల్లోనే చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఇవ్వాలన సూచించారు.












Click it and Unblock the Notifications