ఏపీ ఉద్యోగుల సమ్మె సైరన్-ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు నోటీసు- రేపటి నుంచి పోరు ప్రారంభం
ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న ఉద్యోగసంఘాలు ఇవాళ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 6 నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగసంఘాలు తమ నోటీసులో పేర్కొన్నాయి. ఇప్పటికే సమ్మెకు సంబంధించిన కార్యాచరణ ప్రకారం ఇవాళ జీఏడీ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ కు ఉద్యోగులు ఈ నోటీసులిచ్చారు. అనంతరం ఉద్యోగసంఘాల ప్రతినిధులు మీడియాకు వివరాలు వెల్లడించారు.
Recommended Video

పీఆర్సీపై సమ్మెకు ఉద్యోగులు
ఏపీలో పీఆర్సీ జీవోల వ్యవహారం ఉద్యోగుల్లో కాక రేపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న ఉద్యోగులు.. సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెల 6 నుంచి రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగులు సమ్మెకు వెళ్లబోతున్నట్లు ఇవాళ ప్రకటన చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చారు. ప్రభుత్వం పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకోకపోతే ఫిబ్రవరి 6 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు వారు నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటున్నదన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఉద్యోగసంఘాల ప్రకటన
పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా సమ్మెలోకి వెళ్లేందుకు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని ఉద్యోగసంఘాలు ప్రకటించాయి. ఈ నెలకు పాత జీతాలు ఇవ్వాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని, అనధికారికంగా ఓ కమిటీ వేసి చర్చలకు పిలిచారని ఉద్యోగులు తెలిపారు. ఆమోదయోగ్యమైన పీఆర్సీని ఇవ్వడంతో పాటు సీపీఎస్ విధానం స్ధానంలో ఓపీఎస్ విధానం అమల్లోకి తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని ఉద్యోగసంఘాల నేతలు ఆరోపించారు. పీఆర్సీ నివేదిక ఇవ్వడం, ఈ నెలకు పాత జీతాలు చెల్లిస్తేనే చర్చలకు వస్తామనే విషయాన్ని ఉద్యోగ నేతలు పునరుద్ఘాటించారు.

సమ్మెలోకి టీచర్లు, కార్మికులూ
రాష్ట్రంలో ఉన్న వర్కింగ్ క్లాస్ మొత్తం సమ్మెలోకి వెళ్లబోతున్నట్లు ఉద్యోగసంఘాల నేత సూర్యనారాయణ ప్రకటించారు. సమ్మెలోకి ఉద్యోగులతో పాటు టీచర్లు, కార్మికులు కూడా రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఉద్యోగులకు సంబంధించి ఇదో దురదృష్ణకరమైన రోజని, తమ పోరు ప్రభుత్వంపై కాదని, ప్రభుత్వం తీసుకున్న పీఆర్సీ నిర్ణయంపై మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. గతంలో 12సార్లు చర్చలకు వచ్చినా ఎలాంటి ఫలితం లేదని ఉద్యోగ నేతలు తెలిపారు. తమకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం నియమించిన కమిటీ ఎలా పూర్తిస్తుందో వేచి చూస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు తాత్కాలికంగా అయినా నిలుపుదల చేస్తేనే చర్చలు ముందుకు సాగుతాయన్నారు.

రేపటి నుంచి పోరు ప్రారంభం
రేపటి నుంచి అన్ని జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలతో పోరు ప్రారంభిస్తామని ఏపీ ఎన్జీవోల నేత బండి శ్రీనివాస్ తెలిపారు. ఇది ప్రభుత్వంపై పోరు కాదని, ఉద్యోగులు ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయొద్దని ఆయన సూచించారు. ఇది ప్రభుత్వంపై పోరు కాదన్నారు. ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనతోనే ఉద్యోగసంఘాలు ఏకమైనట్లు సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. సచివాలయ ఉద్యోగులు బయటి సంఘాల తరహాలో ఊరికే ఉద్యమాలు చేయబోదని, కానీ పరిస్ధితి దిగజారినందువల్లే ఇలా చేయాల్సి వస్తోందన్నారు. జీవోలు వెనక్కి తీసుకుంటారన్న భావన తమకు కలగాలంటే ప్రస్తుతానికి పాత జీతాలే ఇవ్వాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications