ఎల్ నినో ముప్పులో ఏపీ- 54 శాతం వర్షాల లోటు-లక్షల ఎకరాల్లో పంటలపై..!
ఏపీలో ఎల్ నినో (EL Nino) ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే రెండు నెలలుగా ఎల్ నినో ప్రభావం కారణంగా దాదాపు 40 శాతం పైగా వర్షపాత లోటు నమోదు కాగా.. ఇప్పుడు అధి కాస్తా 54 శాతానికి పెరిగిపోయింది. దీంతో రాయలసీమతో మొదలుపెట్టి దక్షిణ కోస్తా జిల్లాల వరకూ రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వర్షాలు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతుల్ని ఆదుకునేలా కనిపించడం లేదు.
రాష్ట్రంలో మొత్తం 284 మండలాలు, 1792 గ్రామాల పరిధిలో 2.44 లక్షల హెక్టార్ల పంటలపై ఎల్నినో ప్రభావం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి తాజా నివేదిక సమర్పించారు. 2.44 లక్షల హెక్టార్లలోని పంటలపై వివిధ స్థాయిల్లో ఈ ప్రభావం ఉందని ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో 1,92,387 హెక్టార్లలో తేమ ఒత్తిడి ఉందని తెలిపారు. అలాగే 41,474 హెక్టార్లలో పంటలు వాడిపోయినట్లు, 10582 హెక్టార్లలో పంటలు ఎండిపోయినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు పంటలు కాపాడాలని ఆదేశాలిచ్చారు. అందుబాటులో ఉన్న నీటి వనరులతో రక్షణ తడులు అందించాలని ఆదేశించారు.

మరోవైపు రాష్ట్రంలో రాబోయే రెండు నెలల్లో ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. తాజాగా కురుస్తున్న వర్షాలతో కాస్త పరిస్ధితి మెరుగుపడుతున్నట్లు కనిపిస్తున్నా.. ఎల్ నినో ముప్పు మాత్రం పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ సీజన్ లో భారీ స్ధాయిలో పంటలు నష్టపోతే ఆ ప్రభావం ఆహార భద్రతపై పడుతుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. ఎల్ నినో దెబ్బకు ఈ ఏడాది చివరికి ఇవి మరింత పెరుగుతాయనే అంచనాలున్నాయి.














Click it and Unblock the Notifications
