టీడీపీ ట్రాప్ ఇలా- పదే పదే సజ్జల ఎందుకలా -చంద్రబాబుపై ఎందుకంత నమ్మకం-ఏం జరుగుతోంది ?
ఏపీలో రాజకీయాలు ప్రత్యర్ధుల ఊహకందని విధంగా మారిపోవడం ఎన్నోసార్లు చూశాం. ఓసారి జనం నెత్తిన పెట్టుకున్నారని అనుకునే లోపే పాతాళానికి తొక్కేయడం సర్వసాధారణంగా మారిపోతోంది. అలాగే జనం పూర్తిగా తిరస్కరించారు కాబట్టి ఇక ఆ పార్టీ పనైపోయిందని భావించే లోపే మళ్లీ కొత్త చిగురులు వేయడం కూడా చూస్తూనే ఉన్నాం. 2019 ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న చాలా పరిణామాలు నిశితంగా గమనిస్తే ఇవన్నీ నిజాలే అనిపించకమానదు. అందుకేనేమో ఇప్పుడు అధికార వైసీపీ కూడా జాగ్రత్త పడుతోంది. ప్రత్యర్ధుల వ్యూహాలు రాటుదేలుతున్నాయని ముందే గమనించి జాగ్రత్త పడుతోంది.
వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయానికి దాదాపు పదేళ్ల చరిత్ర ఉంది. 2009లో వైఎస్ మరణం తర్వాత నేరుగా జగన్ తో మొదలైన శత్రుత్వం ఇప్పటికీ టీడీపీ కొనసాగిస్తోంది. అదే సమయంలో వైసీపీ పుట్టుక నుంచే టీడీపీపై కారాలు మిరియాలూ నూరుతూనే ఉంది. అయితే రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు తన అనుభవమే పునాదిగా 2014లో అధికారం దక్కించుకున్నా... మాటపై నిలకడ లేని కారణంగా 2019 కల్లా ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయారు. అయినా ఇప్పటికీ చంద్రబాబు వర్సెస్ జగన్ పోరు నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. 2019లో దారుణ పరాజయంతో పూర్తిగా జవసత్వాలు కోల్పోయిందని వైసీపీ భావించిన టీడీపీ.. ఇప్పుడు కొత్తు చిగురులు వేస్తూ సవాళ్లు విసురుతోంది. దీంతో వైసీపీ కచ్చితంగా అప్రమత్తం కావాల్సిన పరిస్దితులు నెలకొంటున్నాయి.
వ్యూహాలకు పదును పెడుతున్న టీడీపీ
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ని ఎదుర్కోవాలంటే సాధారణ ఎన్నికల వ్యూహాలు సరిపోవని టీడీపీకి 2019 ఎన్నికల ఫలితాల తర్వాత అర్ధమైపోయింది. దీంతో ఇప్పుడు ముప్పేట దాడికి టీడీపీ వ్యూహరచన చేస్తోంది. అదీ ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో సమస్యలపై ఊరికే గొంతు చించుకుంటే ఫలితం లేదని టీడీపీకి అర్ధమైంది. దీంతో వ్యూహాత్మకంగా సమస్యను ఎప్పుడెలా తెరపైకి తీసుకురావాలి, దాన్ని మీడియాలో ఎలా హైలెట్ చేసుకోవాలి, తద్వారా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై టీడీపీ భారీ కసరత్తే చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న డిజిటల్ ఆయుధాలు సరే సరి. దీంతో వైసీపీని ఎదుర్కొనేందుకు టార్గెట్ 2024 ప్లాన్ ను టీడీపీ ఓ రేంజ్ లో అమల్లో పెట్టేస్తోంది.
అప్రమత్తమవుతున్న వైసీపీ
గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ నుంచి ఎదురవుతున్న ఈ సవాల్ ను ఎదుర్కొనేందుకు అధికార వైసీపీ చెమటోడ్చాల్సి వస్తోంది. తాజాగా పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలు చూపించి తాము బలంగానే ఉన్నట్లు పైకి చెప్పుకుంటున్నా అధికార పార్టీగా తమకు లభించిన ఫలితాలే తప్ప ఇవి పూర్తిగా వాస్తవం కాదనే విషయం ఆ పార్టీకి తెలుసు. అందుకనే పైకి కనిపించే దాని కంటే వందరెట్లు ఎక్కువగా తెరవెనుక జరుగుతున్న విషయాలపైనే ఇప్పుడు వైసీపీ దృష్టిసారిస్తోంది. అందుకే వచ్చే మార్చి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ తాజాగా మంత్రులకు చెప్పేశారు. అలాగే కేబినెట్ మార్పుల తర్వాత పదవులు పోయిన మంత్రులు ప్రజల్లోకి వెళ్లి వైసీపీ గెలుపు కోసం ప్రయత్నించాలని సూచించారు. కొత్త మంత్రుల్ని కూడా వదలకుండా వారినీ ఎంపీల గెలుపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
బీసీ సమావేశాలతో సజ్జల బిజీ బిజీ
కులాల ప్రభావం అధికంగా ఉండే ఏపీలో దాన్ని వదిలేసి రాజకీయాలు చేసే పరిస్దితి అస్సలు లేదు. పైకి ఎన్ని మాట్లాడుకున్నా అంతిమంగా పార్టీల్ని అధికారంలో కూర్చోబెట్టాలన్నా, ఇంట్లో కూర్చోబెట్టాలన్నా కులాలే ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. అసలే రాష్ట్ర జనాభాలో సగం ఉన్న బీసీలు తొలిసారి వైసీపీ వైపు పూర్తిగా మొగ్గారు. దీంతో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీంతో తమవైపు మొగ్గిన బీసీ ఓటుబ్యాంకును కాపాడునేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సజ్జల దాదాపు ప్రతీ బీసీ సంఘంతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎలాగో తమవైపే ఉంటారు. కాబట్టి ఇక కాపాడుకోవాల్సింది బీసీల్నే అని భావిస్తున్న సజ్జల వారితో వరుసగా సమావేశాలు పెట్టి అప్రమత్తం చేస్తున్నారు.
విపక్షాల వ్యూహాలు గుర్తు చేస్తూ
కుల సంఘాలతో నిర్వహిస్తున్న సమావేశాల్లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తమ ప్రభుత్వం కులాలకు చేస్తున్న మేలును చెబుతూనే, పదే పదే ప్రత్యర్ధుల వ్యూహాల్ని వారికి గుర్తు చేస్తున్నారు. వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విపక్షాలు కులాలలను ఎలా మభ్యపెడుతున్నాయో, ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ఎలా తీసుకెళ్తున్నాయో వివరిస్తున్నారు. తద్వారా విపక్షాల ట్రాప్ లో తమ కులాల నేతలు, ఓటర్లు పడకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని కుల సంఘాల నేతలకు సజ్జల గుర్తు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉంటూ విపక్షాల వ్యూహాల్ని తిప్పికొట్టాలని సూచిస్తున్నారు.
చంద్రబాబు వ్యూహాలపై సజ్జల గురి
ముఖ్యంగా విపక్ష నేత చంద్రబాబు వ్యూహాలపై వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి గురి బాగా కనిపిస్తోంది. అందుకే పదే పదే చంద్రబాబు వేస్తున్న ఎత్తులపై నేతల్ని అప్రమత్తం చేసేందుకు ఆయన శ్రమిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని, పింఛన్ లు తీసేస్తున్నారు, రేషన్ కార్డులు కట్ చేస్తున్నారు... అప్పులు... అంటూ ప్రజలలో గందరగోళం, అయోమయం సృష్టించేలా ప్రయత్నిస్తున్నారని కుల సంఘాలకు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఏమీ చేయడం లేదు... ఇది ఫెయిల్ అయిన ప్రభుత్వం అంటూ తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తున్నట్లు చెప్తున్నారు.
Recommended Video
వైసీపీపైనే వైసీపీకి అనుమానాలు కలిగేలా..
తాజాగా యాదవ సంఘాలతో జరిపిన సమావేశంలో సజ్జల మరోసారి చంద్రబాబు వ్యూహాల్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు జిమ్మిక్కులు... మోసపు తెలివితేటలు ఏ విధంగా ఉంటాయంటే పై నుంచి కిందస్ధాయి వరకు ఒకే విధమైన దుష్ప్రచారాన్ని మనపై మనకే అనుమానాలు కలిగించేవిధంగా దుర్మార్గంగా చేస్తారని వైసీపీ నేతలకు ఆయన చెప్పారు. ఈరోజు ఒక పత్రికలో ప్రభుత్వం గురించి చెడుగా రాస్తారు. దానిపై ధర్నాలు, ఆందోళనలు చేస్తారని, అదే అంశంపై ఎవరో కోర్టులో వేస్తే దానిపై అక్కడ మొట్టికాయలు పడ్తాయి. దానిపై వారి అనుకూల మీడియాలో డిబేట్లు పెడతారని సజ్జల తెలిపారు. ఇదంతా చూసిన తర్వాత మన కార్యకర్తల్లోనే ఏదో మన వాళ్లు సరిగా వ్యవహరించడం లేదేమో అన్నంతగా ఆలోచన కలుగుతుందన్నారు.
వాస్తవాలను బీసీ కులాలన్నీ ప్రజలలోకి తీసుకువెళ్లాలని ఆయన కోరారు.. టీడీపీ, ఇతర విపక్షాలు చేస్తున్న దుర్మార్గ, దుష్ప్రచారాన్ని ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందని సజ్జల గుర్తు చేశారు