26 కొత్త జిల్లాలు- నేడే నోటిఫికేషన్ : బెజవాడ ఇక ఎన్టీఆర్ జిల్లాగా : కొత్త పేర్లు..హెడ్ క్వార్టర్స్ ఇలా..!!
ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్రియపైన వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రోజున కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు దిశగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. అనూహ్యంగా విజయవాడ పార్లమెంటరీ కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఖరారు చేసారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ఉన్న పామర్రు నియోజవకర్గం మచిలీపట్నం పార్లమెంటరీ పరిధిలో ఉన్నా... విజయవాడ పార్లమెంటరీ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టగా.. మచిలీపట్నం ప్రధాన కేంద్రంగా క్రిష్ఱా జిల్లా కొనసాగనుంది.
ఇక, బాలాజీ, అన్నమయ్య, అల్లూరి, ఎన్టీఆర్, సత్యసాయి పేర్లతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసారు. మంగళవారం ఆన్ లైన్ విధానంలో మంత్రివర్గ ఆమోదం తీసుకొని..ఈ రోజున నోటిఫికేషన్ల విడుదలకు రంగం సిద్దం చేసారు.
ఈ రోజు నోటిఫికేషన్ల జారీ
మొత్తగా ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఇక, జిల్లాల హద్దులు.. వాటి ప్రధాన పాలనా కేంద్రాలను ఖరారు చేసారు. శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాలతోపాటు విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి శ్రీకాకుళం జిల్లాగా ఏర్పాటు.
ఎచ్చెర్ల మినహా విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలకు విశాఖ లోక్సభ స్థానం పరిధిలోని శృంగవరపు కోట శాసనసభ స్థానాన్ని కలిపి విజయనగరం జిల్లా ఏర్పాటు చేయాలి. శృంగవరపు కోట మినహా విశాఖ లోక్సభ స్థానం పరిధిలోని మిగతా ఆరు నియోజకవర్గాలతో విశాఖపట్నం జిల్లాను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలో ఉన్న పెదగంట్యాడ మండలాన్ని విశాఖ జిల్లా పరిధిలోకి మార్చారు.
పార్వతీపురం కేంద్రంగా అల్లూరి జిల్లా
అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో కొత్తగా అనకాపల్లి జిల్లా ఏర్పాటు. అరకు లోక్సభ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించాలి. పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాలతో పార్వతీపురం జిల్లాను ఏర్పాటు చేయాలి. రంపచోడవరం, పాడేరు, అరకు వ్యాలీ నియోజకవర్గాలతో కలిపి పాడేరు కేంద్రంగా కొత్తగా అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లా ఏర్పాటు.
అమలాపురం లోక్సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు. కాకినాడ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కాకినాడ జిల్లా గా ఖరారు. రాజమహేంద్రవరం కేంద్రంగా రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో తూర్పు గోదావరి జిల్లా ఏర్పాటు.
బెజవాడకు ఎన్టీఆర్ - క్రిష్ణా జిల్లా కంటిన్యూ
ఏలూరు లోక్సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో ఏలూరు కేంద్రంగా జిల్లా ఏర్పాటు.నరసాపురం లోక్సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటు. మచిలీపట్నం లోక్సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కలిపి మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా ఖరారు.
విజయవాడ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కలిపి విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా గా ఖరారు. గుంటూరు లోక్సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో కలిపి గుంటూరు జిల్లా ఏర్పాటు. బాపట్ల లోక్సభ స్థానం పరిధిలోని సంతనూతలపాడు ఒంగోలుకు సమీపంలో ఉంటుంది.
ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యం కోసం సంతనూతలపాడు మినహా బాపట్ల లోక్సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పాటు. నరసరావుపేట లోక్సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో పల్నాడు జిల్లా ఏర్పాటు.
తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా
ఒంగోలు లోక్సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకర్గాలకు బాపట్ల లోక్సభ స్థానం పరిధిలోని సంతనూతలపాడు శాసనసభ స్థానాన్ని కలిపి ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా ఏర్పాటు. తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరుకు సమీపంలో ఉంటుంది. ప్రజల సౌకర్యం కోసం నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలు, తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని సర్వేపల్లితో కలిపి నెల్లూరు కేంద్రంగా శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా ఏర్పాటు.
సర్వేపల్లి శాసనసభ స్థానం మినహా తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలకు చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని చంద్రగిరి శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లాగా ఖరారు.
రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా
చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం పోనూ చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ స్థానాలకు రాజంపేట లోక్సభ స్థానం పరిధిలోని పుంగనూరును చేర్చి చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లా ఏర్పాటు. పుంగనూరు శాసనసభ నియోజకవర్గంపోనూ రాజంపేట లోక్సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో రాయచోటి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది.
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని తన పాటతో సేవించిన వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులను స్మరించుకుంటూ రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు అన్నమయ్య జిల్లాగా ఖరారు. కడప లోక్సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కడప కేంద్రంగా వైఎస్సార్ జిల్లా ఏర్పాటు.
పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా
నంద్యాల లోక్సభ స్థానం పరిధిలోని పాణ్యం శాసనసభ నియోజకవర్గం కర్నూలుకు సమీపంలో ఉంటుంది. ప్రజల సౌకర్యం కోసం కర్నూలు లోక్సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలకు పాణ్యం శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి కర్నూలు జిల్లా ఏర్పాటు ప్రతిపాదన. పాణ్యం మినహా నంద్యాల లోక్సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో నంద్యాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు. హిందూపురం లోక్సభ స్థానం పరిధిలోని రాప్తాడు నియోజకవర్గం అనంతపురానికి సమీపంలో ఉంటుంది. ప్రజల సౌకర్యం కోసం అనంతపురం లోక్సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలకు రాప్తాడు శాసనసభ స్థానాన్ని కలిపి అనంతపురం జిల్లా.
రాప్తాడు మినహా హిందూపురం లోక్సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో పుట్టపర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటు. శ్రీసత్యసాయిబాబా సేవలను స్మరించుకుంటూ పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు సత్యసాయి జిల్లాగా ఖరారు చేసారు.