కిడారి, సోమ అంత్యక్రియలు పూర్తి...అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు
విశాఖపట్టణం:మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ భౌతికకాయాలకు అంత్యక్రియలు ముగిశాయి. రాష్ట్ర మంత్రుల సమక్షంలో అధికారిక లాంఛనాలతో ఘనంగా అంతిమ సంస్కారాలను నిర్వహించారు.
ఎమ్మల్యే కిడారి సర్వేశ్వరరావు భౌతికకాయానికి పాడేరులో అంత్యక్రియలు నిర్వహించగా, సివేరి సోమ అంత్యక్రియలు అరకులో జరిపారు. అంతకుముందు వీరిద్దరి మృతదేహాలకు సోమవారం ఉదయం పాడేరు ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కిడారి మృతదేహం పాడేరుకు,సోమ మృతదేహాన్ని అరకు దగ్గర ఉన్న బట్టివలసకు తరలించడం జరిగింది.
తమ అభిమాన నేతల భౌతిక కాయాలను అనుచరులు,కార్యకర్తలు,అభిమానులు సందర్శించిన అనంతరం అంతిమయాత్ర చేపట్టారు. ఈక్రమంలో పాడేరులో భారీ వర్షం పడుతున్నా అభిమానులు లెక్కచేయకుండా ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మరోవైపు వీరిద్దరి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రత్యేక చాపర్ లో అరకు ప్రాంతానికి వెళ్లిన రాష్ట్ర మంత్రులు కొందరు అరకు వెళ్లగా మరికొందరు పాడేరు వెళ్లారు.
ఇక విశాఖ జిల్లా చరిత్రలో నక్సలైట్లు ఒక ఎమ్మెల్యేని హతమార్చడం ఇదే ప్రథమం. ఆంధ్ర -ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఉన్న విశాఖ జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం ఆది నుంచి అధికంగానే కనిపిస్తుంది. తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అనుమానించిన వారిని దళసభ్యులు హతమారుస్తున్నారు. వీరిలో ఇన్ఫార్మర్ల నెపంతో కొందరిని, తమకు ప్రత్యర్థులుగా భావిస్తున్న పోలీసులు, మావోయిస్టులను, ప్రభుత్వానికి అనుకూలంగా, గిరిజనులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని ప్రజాప్రతినిధులను వీరు చంపుతున్నారు.
Recommended Video
అయితే 1990లో అప్పటి చింతపల్లి ఎమ్మెల్యే పసుపులేటి బాలరాజు, ఐటీడీఏ పీవో దాసరి శ్రీనివాసులు, తదితరులను పీపుల్స్వార్ నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. జైలులో ఉన్న నక్సలైట్ నేత క్రాంతి రణదేవ్ను విడుదల చేయాలన్న డిమాండ్తో ఈ కిడ్నాప్నకు అప్పట్లో పాల్పడ్డారు. దాదాపు నెల రోజుల అనంతరం ప్రభుత్వం క్రాంతి రణదేవ్ను విడుదలతో నక్సలైట్లు బాలరాజు, తదితరులను విడిచిపెట్టారు. ఆ క్రమంలో నక్సల్స్ చెరలో ఉన్న వీరందరినీ చంపేయడం ఖాయమని అంతా ఆందోళన చెందారు. కానీ అలా చేయలేదు. అయితే తాజాగా అరకు ఎమ్మెల్యే కిడారి,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపడం ఇదే తొలిసారిగా విశాఖ జిల్లా చరిత్రలోకి ఎక్కుతుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.