TDP: ఇన్ సైడ్ ట్రేడింగ్: సీబీఐతో విచారణపై జగన్ మనసు మార్చుకున్నారా?: తెరపై లోకాయుక్త..!
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో భారీగా ఇన్ సైడ్ ట్రేడింగ్ చోటు చేసుకుందనే ఆరోపణలపై విచారణ జరిపించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇన్ సైడ్ ట్రేడింగ్ ఆరోపణలపై సీబీఐతో కంటే లోకాయుక్తతో విచారణ జరిపించే దిశగా ఆయన త్వరలోనే ఓ కీలక నిర్ణయాన్ని తీసుకోవచ్చని అంటున్నారు. జాప్యాన్ని నివారించడానికి, అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నేతల దూకుడుకు అడ్డుకట్ట వేయడానికీ లోకాయుక్తతో విచారణ ఆరంభించాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
సీఎం జగన్ అమరావతిని చంపేయాలని చూస్తున్నారు, 'పిచ్చి కుక్క’ కథ చెప్పిన చంద్రబాబు
సీబీఐతో విచారణకు తీర్మానం చేసినా..
అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించకముందే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారని, ఇన్ సైడ్ ట్రేడింగ్కు పెద్ద ఎత్తున చేపట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచీ ఆరోపిస్తూనే వస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ భారీ ఎత్తున విమర్శలు గుప్పించింది. అధికారంలోకి వచ్చ ఏడు నెలలు అవుతున్నప్పటికీ.. ఈ ఆరోపణలపై విచారణ జరిపించడానికి వైఎస్ఆర్సీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారించినా..
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ హయాంలో నమ్మకస్తులు, బినామీల పేరుతో నాలుగువేల ఎకరాలకు పైగా కొనుగోలు చేశారంటూ మంత్రివర్గ ఉపసంఘం కొద్దిరోజుల కిందటే తన నివేదికను అందజేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికపై న్యాయశాఖ అధికారులతో సమీక్షించిన జగన్.. ఒకటి రెండు రోజుల్లో లోకాయుక్తతో విచారణకు ఆదేశించాలని భావిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ ఉపసంఘం అందజేసిన నివేదిక ఆధారంగా ఈ విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
సీబీఐపై మనసు మారడానికి
తెలుగుదేశం పార్టీ నాయకుల ఇన్ సైడ్ ట్రేడింగ్ ఆరోపణలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ ముఖ్యమంత్రి తొలుత భావించారు. దీనిపై మంత్రివర్గ సమావేశంలోనూ ఓ తీర్మానం చేశారు. అక్కడే అసలు చిక్కు వచ్చి పడిందని అంటున్నారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థ. కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే తప్ప పని జరగదు. ఇన్ సైడ్ ట్రేడింగ్ ఆరోపణలపై విచారణ జరిపించడానికి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంగీకరిస్తుందా?, దీన్ని సీబీఐకి అప్పగిస్తుందా? అనే అనుమానాలు వైసీపీ నేతల్లో వ్యక్తమౌతున్నాయి.
లోకాయుక్తతో ఆరంభించి..
ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా లేదు. అలాగని కాంగ్రెస్ కూ మద్దతు ఇవ్వట్లేదు. తటస్థంగా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి లబ్ది కలిగించేలా, తన మాజీ మిత్ర పక్షం తెలుగుదేశానికి నష్టం కలిగించేలా కేంద్రంలో అధికారంలో బీజేపీ నిర్ణయం తీసుకుంటుందా? అనే సందేహాలు అధికార పార్టీ నాయకులను తొలిచి వేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీబీఐ కంటే కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే లోకాయుక్తతో విచారణ జరిపించాలని, అవసరమైతే దాన్ని సీబీఐకి బదలాయించాలని భావిస్తోంది.